BRS: మహారాష్ట్రలో మహా రాజకీయం. ఎన్సీపీకి మరోసారి వెన్నుపోటు పొడిచారు అజిత్ పవార్. ఇప్పటికే షిండే-శివసేన, బీజేపీల ఉమ్మడి ప్రభుత్వం మహా బలంగా ఉంది. అయినా, ప్రత్యర్థి పార్టీని చీల్చడంలో ఏమాత్రం సంకోచించలేదు కమలనాథులు. గతంలోనూ ఇదే తరహా పాచికలాట ఆడారు. రాత్రికి రాత్రే అజిత్ పవార్కు కాషాయ కండువా కప్పేసి.. తెల్లవారుజామున గప్చుప్గా డిప్యూటీ సీఎంను చేసేశారు. అయితే, ఆ సర్కారు మూడ్రోజుల ముచ్చటలానే ముగిసింది. కొన్నాళ్లు కామ్గా ఉన్న బీజేపీ.. ఎన్సీపీని వదిలేసి శివసేనను చీల్చేసి.. షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినా, సంతృప్తి చెందలేదు. పవార్ కుటుంబంలో లుకలుకలను తమకు అనుకూలంగా మార్చేసుకుని.. మరోసారి అజిత్ పవార్ను బీజేపీలోకి లాగేసి.. మళ్లీ అదే డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టబోతోంది. ఇలా మహారాష్ట్రలో డబుల్ ఇంజిన్ కాస్తా.. త్రిబుల్ ఇంజిన్ సర్కారుగా మారింది.
కాలం కలిసిరావడం లేదుకానీ.. తెలంగాణలోనూ ఇదే తరహా రాజకీయం నెరిపేందుకు కమలదళం ప్రయత్నిస్తోందనే అనుమానం ఉంది. గత ఎన్నికల సమయంలోనే గట్టిగా ట్రై చేశారు. కానీ, అది వర్కవుట్ కాలేదు. ఈసారి సైతం పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో.. మరోసారి రాజకీయ పావులు కదిపేందుకు కాషాయ పార్టీ కాచుకు కూర్చుందని అంటున్నారు. మహారాష్ట్రలో పవార్ ఫ్యామిలీతో పవర్ పాలిటిక్స్ ప్లే చేసినట్టుగానే.. తెలంగాణలోనూ బీఆర్ఎస్ కుటుంబం టార్గెట్గా రాజకీయాన్ని మార్చేసేలా ప్రయత్నిస్తోందని డౌట్.
2018 ఎన్నికలవేళ తెలంగాణలో హోరాహోరీ పోరు జరిగింది. అప్పుడప్పుడే కేటీఆర్కు పార్టీలో ప్రాధాన్యం పెంచారు కేసీఆర్. తన వారసుడిగా పరోక్షంగా కుమారుడినే ప్రకటించారు. ఆ పరిణామం అల్లుడు హరీశ్రావుకు మింగుడుపడలేదని అంటారు. అందుకే, ఎన్నికలకు ముందే బీజేపీతో ఒప్పందం చేసుకున్నారని.. బీఆర్ఎస్కు బొటాబొటి సీట్లు వస్తే.. తాను తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరేలా.. కీలక పదవి ఇచ్చేలా.. తెరవెనుక డీల్ కుదిరిందని ప్రచారం జరిగింది. పార్టీలో తనను పక్కనపెట్టి.. కేటీఆర్కే ప్రయారిటీ ఇస్తున్నారనే అక్కస్సుతో.. గజ్వేల్లో కేసీఆర్ను సైతం ఓడించేందుకు హరీశ్రావు కుట్ర చేశారని అన్నారు. ఆ విషయం గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్రెడ్డినే ఓ బహిరంగ సభలో స్వయంగా వెల్లడించడం అప్పట్లో కలకలం రేపింది.
కానీ, హరీశ్ అనుకున్నది ఒక్కటి.. జరిగింది మరొకటి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ వన్ సైడెడ్గా గెలిచేసింది. కేసీఆర్కు తిరుగులేని అధికారం కట్టబెట్టింది. పార్టీని చీల్చే ఛాన్స్ లేకుండా పోయింది. అల్లుడు చేసిన కుట్రను పనిష్మెంట్గా హరీశ్కు మంత్రి పదవి ఇవ్వకుండా చాలాకాలం వెయిటింగ్లో పెట్టారు సీఎం కేసీఆర్. హరీశ్కు ఫుల్ సపోర్ట్గా ఉండే ఈటల రాజేందర్ను కూడా కేబినెట్లో చేర్చుకోలేదు. కొన్ని నెలల తర్వాత.. హరీశ్రావు తప్పుతెలుసుకున్నాక.. మళ్లీ మామ దారిలోకి వచ్చి కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించాక.. వారిద్దరికీ మంత్రిమండలిలో అవకాశం కల్పించారు. అప్పటి నుంచి కేసీఆర్ కుటుంబం కలిసికట్టుగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ……
రాజకీయాల్లో ఎవరినీ తక్కువ అంచనా వేయలేం. అవకాశం రాకనే అంతా మంచిగా ఉంటారు. ఛాన్స్ చిక్కితే.. చక్రం తిప్పేందుకు రెడీ అవుతారు. మహారాష్ట్ర ఎన్సీపీలో అలానే జరిగింది. అజిత్ పవార్ ఓసారి హ్యాండిచ్చి పార్టీని వీడారు. మళ్లీ తిరిగొచ్చి మూడేళ్లు ఓపికగా ఎదురుచూశారు. అన్న కొడుకునైన తనకు కాకుండా.. శరద్ పవార్ కూతురికే పార్టీ పగ్గాలు అప్పగించడంతో.. రెండోసారి వెన్నుపోటు పొడిచారు. 30 మంది ఎమ్మెల్యేలతో వెళ్లి.. మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యారు. ఈ రాజకీయ క్రీడను వెనుకుండి నడిపించింది బీజేపీనే అనడంలో సందేహమే అవసరం లేదు. మరి, తెలంగాణలోనూ ఇలానే జరిగే ఛాన్స్ ఉందా?
ఈసారి రాష్ట్రంలో ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. బీఆర్ఎస్ విజయావకాశాలు బాగా సన్నగిల్లాయి. కాంగ్రెస్ జోరు మీదుంది. బీజేపీ బేజారవుతోంది. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ వచ్చేలా లేదు. అదే జరిగితే.. అజిత్ పవార్లా.. హరీశ్రావును కేసీఆర్ మీదకు ఆయుధంగా ప్రయోగించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇప్పటికే ఓసారి ఆ అటెంప్ట్ కోసం ట్రై చేసినా.. అప్పట్లో నెంబర్ గేమ్ వారికి అనుకూలంగా లేదు. ఈసారి కాలం కలిసొచ్చేలా ఉంది. తెలంగాణలో హంగ్ పరిస్థితి వస్తే.. బీజేపీ చక్రం తిప్పాలనుకుంటే.. సేమ్ టు సేమ్.. మహారాష్ట్రలో పవార్ ఫ్యామిలీతో ఆడిన పవర్ పాలిటిక్సే.. తెలంగాణలోనూ కేసీఆర్ కుటుంబంతో ఆడే అవకాశం ఎక్కువగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు రాజకీయ పండితులు. కీలక పదవి ఆఫర్ చేసి.. అజిత్ పవార్ మాదిరే.. హరీశ్రావుతో బీఆర్ఎస్ను చీల్చి.. తాము అధికారంలోకి వచ్చేలా.. కమలదళం రాజకీయ జూదం ఆడినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.