Revanth Reddy : ఖమ్మంలో కాంగ్రెస్ తలపెట్టిన జనగర్జన సభకు జనం భారీగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సభపై ప్రభుత్వం ఆంక్షల కొరఢా ఝలిపిస్తోంది. ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రైవేట్ వాహనాలను నేతలు సమకూర్చి కార్యకర్తలను సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో 1700 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఎన్ని ఆంక్షల పెట్టినా సభను విజయవంతం చేసి తీరుతామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఖమ్మం సభకు వెళ్లే వాహనాలను పోలీసులు అడ్డుకోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ కు ఫోన్ చేశారు. పోలీసుల పెడుతున్న ఆంక్షలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితి చేయిదాటితే పోలీసులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. సభకు వెళ్లే వాహనాలను అడ్డుకోకుండా ఆదేశాలిస్తామని డీజీపీ ..రేవంత్ కు హామీ ఇచ్చారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఖమ్మం సభకు షెడ్యూల్ టైమ్ కంటే ముందే రేవంత్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఆయనతోపాటు మాజీ ఎంపీ, సీనియర్ మధుయాష్కీ కూడా ఉన్నారు.
సభను సక్సెస్ కాకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని రెండురోజులు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. సభకు వచ్చేవారిని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇలా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సభను విజయవంతం చేస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఖమ్మం కాంగ్రెస్ సభపై కేసీఆర్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. పోలీసులు దమననీతిని అనుసరిస్తున్నారని ఆమె ఆరోపించారు. కుట్రలను చేధించుకొని తరలిరావాలని సీతక్క కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.