Ponguleti : ఖమ్మం సభకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి విమర్శించారు. రాత్రి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అధికార దాహంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ దౌర్జన్యాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
ఖమ్మం సభకు జనం భారీగా తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 15 వేల వాహనాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అయితే రాత్రి నుంచి 1700 వాహనాలు సీజ్ చేశారని చెప్పారు. ప్రైవేట్ వాహనాలలో జనం రాకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా సరే కాంగ్రెస్ సభను సక్సెస్ కాకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అయినా సరే బీఆర్ఎస్ సభను తలదన్నేలా కాంగ్రెస్ జనగర్జన సభ నిర్వహిస్తామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా లక్షల మందివస్తారని పేర్కొన్నారు.
సభకు వెళితే సంక్షేమ పథకాలు ఇవ్వమని ప్రజలను అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. రైతు బంధు ఆపేస్తామని రైతులను భయపెడుతున్నారని మండిపడ్డారు. పోడు భూములు పట్టాలు ఇస్తామని గిరిజనులను ప్రలోభపెడుతున్నారని తెలిపారు. కేసీఆర్ పతనం ఖమ్మం సభ నుంచే మొదలవుతుందని పొంగులేటి స్పష్టం చేశారు.