Student : కడప జిల్లా ఖాజీపేట మండలం కొత్తనెల్లూరులో బీరం శ్రీధర్రెడ్డి విద్యాసంస్థల్లో విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పులివెందులకు చెందిన ఆరో తరగతి విద్యార్థి సోహైల్ శనివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు.
ఆ విద్యార్థి కడుపునొప్పిగా ఉందని హాస్టల్ సిబ్బందికి చెప్పాడని తెలుస్తోంది. కుమారుడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడని సమాచారం అందగానే.. వెంటనే హాస్టల్ కు చేరుకున్నారు తల్లిదండ్రులు. అప్పటికే సోహైల్ మృతిచెందాడు. కానీ తమ కుమారుడు బతికే ఉన్నాడని.. బైక్ పై హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు సోహైల్ మృతిచెందినట్టుగా ప్రకటించారు. దీంతో వారు స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ కుమారుడి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒంటిపై గాయాలున్నాయని అంటున్నారు. ఉపాధ్యాయుడు కొట్టడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తున్నారు. అతని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్ద సోహైల్ మృతదేహంతో ఆందోళనకు చేపట్టారు. విద్యార్థి సంఘాల నాయకుల, స్థానికులు భారీగా పాఠశాల వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. స్కూల్ ఫర్నిచర్ ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి.
బీరం శ్రీధర్ రెడ్డి స్కూల్ వద్దకు పోలీసులు చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాలు, బంధువుల ఆందోళన కొనసాగించాయి.