Pawan Tholi Prema : విజయవాడ కపర్తి థియేటర్ విధ్వంసం.. ఏపీలో రాజకీయ రచ్చకు వేదికవుతోంది. థియేటర్ దాడి వెనుక కుట్ర దాగుందని.. జనసేన ఆరోపిస్తోంది. దాడి ఘటనను పరిశీలిస్తే.. రాజకీయ కారణాలున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా.. అక్కడి వ్యవహారం కనిపిస్తోందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. థియేటర్ పై దాడి కచ్చితంగా ప్రీ ప్లాన్ అని.. విచారణ చేపట్టి నిందితులను ప్రజల ముందు నిలబెట్టాలని.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.
పవన్ కల్యాణ్.. ఒకప్పటి బ్లాక్ బస్టర్ మూవీ.. తొలిప్రేమ.. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. రీ రిలీజ్ చేశారు. అయితే విజయవాడ కపర్తి థియేటర్లో సెకండ్ షో ప్రదర్శిస్తున్న సమయంలో.. కొందరు అల్లరి మూకలు విధ్వంసం సృష్టించారు. ఓ వైపు సినిమా నడుస్తుండగానే.. స్క్రీన్ దగ్గర హంగామా సృష్టించారు. తెరను పూర్తిగా చించేసి అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. దీంతో స్క్రీన్ వెనుకున్న భారీ సౌండ్ బాక్సులు కనిపించాయి. ఇటు ప్రేక్షకులు కూర్చునే సీట్లను కూడా ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలు, థియేటర్ బయటి అద్దాలను పగులగొట్టారు. స్క్రీన్ పై చూడాల్సిన యాక్షన్ పార్ట్ ను.. ఆడియన్స్ కళ్లముందే ప్రదర్శించారు. ఇటు అల్లరి మూకలను ఆపేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది.
అయితే పవన్ ఫ్యాన్స్ ఇలా చేయడమేంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ ఘటన వెనుక.. కచ్చితంగా కుట్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కపర్తి థియేటర్ విధ్వంసంపై పోలీసులు రంగంలోకి దిగారు. పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అరాచకాన్ని సృష్టించిన అల్లరి మూకలను పట్టుకుంటామని.. స్పష్టం చేశారు. ఇటు థియేటర్ విధ్వంసం వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పెద్ద ఎత్తున షేర్ అయ్యాయి.