Bus Accident: మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్వేపై బస్సు దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో 25 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
33 మంది ప్రయాణికులతో యావత్మాల్ నుంచి పుణెకు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శనివారం వేకువజామున 2 గంటల సమయంలో టైర్ పేలి బస్సు డివైడర్ను ఢీకొట్టింది. వెంటనే ఒక్కసారిగా మంటల చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడ్డవారిని బుల్దానా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బస్సు ప్రమాదానికి గురైన సమయంలో చాలామంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. వారంతా నిద్రలోనే సజీవదహనమయ్యారు. కొందరు ప్రయాణికులు మాత్రం బస్సు కిటికీలు పగలగొట్టి బయటపడ్డారు.
బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఏక్నాథ్ శిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు.
మహారాష్ట్ర బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.