Pawan Kalyan: భీమవరం సభలో పంచ్లతో చెలరేగిపోయారు పవన్ కల్యాణ్. “ముఖ్యమంత్రి, ఈ పెద్దమనిషి.. నేను ఓ ఊగిపోతా ఊగిపోతానని అంటున్నాడు.. జరిగిన అన్యాయానికి ఊరుకోరు.. కోపం వస్తే ఊగుతూనే మాట్లాడుతారు.. కావాలంటే వైసీపీ ఎంపీ రఘురామను అడుగు”.. అంటూ సీఎం జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు.
అమ్మ ఒడి ఫోటోలో.. బలపం పట్టి బాలికకు అఆలు దిద్దిస్తున్న జగన్ను చూస్తే తనకు గాంధీ గుర్తొచ్చాడని చెప్పారు. గాంధీజీ ‘సత్య శోధన’ అనే పుస్తకం రాసినట్టు.. జగన్ ‘అసత్య శోధన’ పుస్తకం రాయాలన్నారు. ఆ పుస్తకంలో ఆయన చేసిన దారుణాలన్నీ ప్రస్తావించాలని చెప్పారు. యువకుడిగా ఉన్నప్పుడు.. తాత ప్రోద్బలంతో.. ఎస్సై ప్రకాశ్బాబును పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. తనను వ్యతిరేకించారని.. సొంతపార్టీ ఎంపీ రఘురామను పోలీసులతో కొట్టించాడని అన్నారు. పోలీసులంటే గౌరవంలేని వ్యక్తి.. రాష్ట్రాన్ని పాలిస్తుంటే.. ఈ రాష్ట్రంలో పుట్టినందుకు తాను సిగ్గు పడుతున్నానని మండిపడ్డారు పవన్ కల్యాణ్.
గంజాయిని రాష్ట్ర పంటగా మార్చేశారని.. గొడ్డలిని రాష్ట్ర ఆయుధంగా చేసేశారని.. జగన్ను ఉద్దేశించి అన్నారు. వైసీపీతో సై అంటే సై అని.. దేనికైనా రెడీ అని సవాల్ చేశారు జనసేనాని. తాను తెగించి ఉన్నానని.. ఓడిపోయినోడిని.. నిండా మునిగిపోయినోడికి చలేంటని..అన్నారు. పాతిక సంవత్సరాలు కూలీగా పని చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
జనసేన కార్యకర్తలు తమ ఇళ్ల చుట్టూ.. సైలెన్సర్లు లేని బండ్లు వేసుకొని హంగామా చేస్తున్నారని కొందరు అంటున్నారని.. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడితే.. మీ నోళ్లకు సైలెన్సర్లు లేకపోతే.. మా జనసైనికుల బైకులకు కూడా సైలెన్సర్లు ఉండవని.. తగ్గేదేలే టైప్లో హెచ్చరించారు పవన్ కల్యాణ్.