Snooker: ఈరోజుల్లో మానసిక వ్యాధులు తీవ్రంగా ఎక్కువయిపోతున్నాయి. అందులోనూ ముఖ్యంగా డిప్రెషన్ అనేది మనుషుల ప్రాణాలను తీసేస్తోంది. డబ్బు, ఫేమ్ అనేవి ఏవి డిప్రెషన్ నుండి మనుషులను కాపాడలేకపోతున్నాయి. ముఖ్యంగా యూత్.. డిప్రెషన్ వల్ల ప్రాణాలను తీసుకోవడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా పాకిస్థాన్కు చెందిన ఫేమస్ ఆటగాడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మరణానికి కారణం డిప్రెషనే అని అందరూ అనుమానిస్తున్నారు.
పాకిస్థాన్కు చెందిన ప్రముఖ స్నూకర్ ప్లేయర్ మహమ్మద్ మజీద్ అలీ వయసు 28 ఏళ్లే. ఈద్ ఉల్ అధా రోజున అలీ ఆత్మహత్య చేసుకున్నాడు. తను చాలాకాలంగా డిప్రెషన్తో పోరాడుతున్నాడని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గత నెలలోనే ప్రముఖ స్నూకర్ ప్లేయర్ మహమ్మద్ బిలాల్ గుండెపోటుతో మరణించాడు. నెల రోజులలోనే ఇలా మరో స్నూకర్ ప్లేయర్ మరణించడం చాలా బాధాకరంగా ఉందంటూ పాకిస్థాన్ బిలియార్డ్స్ అండ్ స్నూకర్ అసోసియేషన్ (పీబీఎస్ఏ) వాపోయింది.
మహమ్మద్ మజీద్ అలీ మంచి స్నూకర్ ప్లేయర్, అతడు పాకిస్థాన్కు ఎంతో గుర్తింపును, మెడల్స్ను తీసుకొస్తాడని భావించామని తోటి ప్లేయర్స్ చెప్తున్నారు. అలీ.. తన సొంతూరు సుముంద్రీలో చెక్కను కట్ చేసే మెషీన్తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలీ సోదరుడు ఉమర్ కూడా తన సోదరిడిది ఆత్మహత్య అనే నిర్ధారించాడు. గత కొన్నేళ్లుగా అలీ డిప్రెషన్లో ఉన్నాడని, దానికి గల కారణం తెలియదని బయటపెట్టాడు. అంతే కాకుండా వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవన్నాడు.
డిప్రెషన్లో ఉన్నా కూడా ఆత్మహత్య చేసుకుంటాడని ఊహించలేదంటూ ఉమర్ బాధపడ్డాడు. ఏషియన్ యూ21 ఛాంపియన్షిప్లో మజీద్ అలీ సిల్వర్ మెడల్ను గెలుచుకుని తన దేశం గర్వపడేలా చేశాడు. అలీ మరణానికి పీబీఎస్ఏ ఛైర్మన్తో పాటు తోటి ప్లేయర్స్ కూడా సంతాపం తెలియజేశారు. మహ్మమద్ యూసఫ్, మహమ్మద్ అసీఫ్ లాంటి ఆటగాళ్ల వల్ల పాకిస్థాన్లో స్నూకర్కు చాలా పాపులారిటీ దక్కింది. మజీద్ అలీ కూడా వారి స్థాయికి చేరుకుంటాడని అందరూ భావించారు. కానీ తన జీవితం ఇలా అర్థాంతరంగా ఆగిపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు తోటి ప్లేయర్స్ దు:ఖంలో మునిగిపోయారు.