Vrudda Kashi: శివుడు వెలసిన క్షేత్రాల్లో అన్నింటికి కన్నా విశిష్టమైన కాశీ విశ్వేశురుడి ఆలయం. కానీ కాశీ కన్నా పురాతన ఆలయం మరోటి ఉంది. అదే వృద్ధ కాశీ. ఈ ఆలయ స్థలపురాణం ప్రకారం భూమిమీదే అతి ప్రాచీనమైన ఈ ఆలయం తమిళనాడులో ఉంది. వృద్ధాచలం కొండ కూడా ఆ పరమేశ్వర స్వరూపంగా చెబుతారు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే పరమేశ్వరుడు ఇక్కడ ఉద్భవించాడట. వృద్ధ కాశీ క్షేత్రాన్ని దర్శిస్తే, కోరికలు త్వరగా నెరవేరతాయట . ఈ ఆలయంలో స్వామి ఎన్నో మహత్యాలు చూపించాడు. అందుకే వృద్దుడు , వృద్ధాచలేశ్వరుడుగా పేరుంది. శైవులకి ముఖ్యమైన క్షేత్రాలు 108 ఉండగా…వాటిలో 4 క్షేత్రాలు అతి ముఖ్యమైని. అందులో తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో విరుదాచలం అతి పురాతనమైన క్షేత్రం. ప్రళయకాలంలో కూడా ఆలయం చెక్కు చెదరలేదు.
ఈ క్షేత్రంలో స్వామిని సేవిస్తే కాశీ విశ్వనాధుని సేవించినదానికన్నా కొంచెం ఎక్కువ పుణ్యం వస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. పరమ శివుడు ఈ ప్రాంతంలో ఆనంద నాట్యం చేశాడంటారు. ఇక్కడ పుట్టినా, గిట్టినా, నివసించినా, భగవంతుణ్ణి ప్రార్ధించినా, ఈ స్వామిని తలచినా మోక్షం లభిస్తుందని విశ్వాసం. అరుణాచలానికి వంద కిలోమీటర్ల దూరంలోనే ఈ వృద్ధ కాశీ ఉంది . తిరువణ్ణామలైలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికీ భక్తులు ఇక్కడా గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. వల్లీ దేవసేనలతో సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుతీరి వున్నాడు. ఈఆలయానికి పైన చక్రాలుంటాయి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఇలాంటి చక్రాలు ఉన్న శివాలయాలు చాలా తక్కువ.
కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది అంటారు. అలాగే ఈ వృధ్ధాచలంలో మరణించిన వారికి అంతకన్నా ఎక్కువ పుణ్యమే వస్తుందని విశ్వాసం. శివుడు స్వయంభువుడు కావడంతో స్వామిని దర్శిస్తే మనశ్శాంతి కలుగుతుందని నమ్మకం. అలాగే అన్ని రకాల శారీరక సమస్యల నుంచి తక్షణమే విముక్తి కలుగుతుందని అంటారు. ఈ ఆలయం దగ్గరున్న ఐదు ఆలయాల్లో ఒకటైన దుర్గాదేవిని పూజిస్తే సంతాన సమస్యలు తీరుతాయని , జీవితంలో అభివృధ్ధి చెందుతారని అంటారు.