Chandrababu: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో కృష్ణానది కరకట్టపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివసిస్తున్న ఇంటి జప్తుకు సంబంధించి ఏసీబీ కోర్ట్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. కరకట్ట నివాసం జప్తునకు ఏపీ సీఐడీకి అనుమతిస్తూ తీర్పునిచ్చింది. ఇంటి ఓనర్ లింగమనేని రమేష్తో పాటు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.
కరకట్టపై చంద్రబాబు నాయుడు గెస్ట్హౌస్ను గతనెల 14న ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1994 చట్టం ప్రకారం అటాచ్ చేస్తున్నట్టు తెలిపింది. చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు, సాధారణ ఆర్థిక నియమాలు పూర్తిగా ఉల్లంఘించారని ఆరోపించింది. స్థానిక జడ్జికి సమాచారమిస్తూ కరకట్టపై చంద్రబాబు గెస్ట్హౌస్ను అటాచ్ చేసింది.
సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లలో అవతవకలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించి ఏపీ సీఐడీ విచారణ జరుపుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ వారి పదవులను దుర్వినియోగం చేసినట్టుగా ఏపీ సీఐడీ చెబుతోంది. అధికారం ఉపయోగించుకుని బంధువులకు, స్నేహితులకు ప్రయోజనాలు కల్పించారని సీఐడీ అభియోగాలు మోపింది. వ్యాపారవేత్త లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించినందుకు ప్రతిఫలంగా గెస్ట్హౌస్ తీసుకున్నారని ఆరోపించింది.