CM KCR: పోరు తెలంగాణ.. పోడు తెలంగాణగా మారింది. దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న పోడు భూముల సమస్య కొలిక్కి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 1.51 లక్షల రైతులకు.. 4.06 లక్షల ఎకరాలకుపైగా పోడు భూముల పట్టాల పంపిణీ షురూ చేశారు సీఎం కేసీఆర్. పోడు పట్టాలు అన్నింటినీ మహిళల పేరుమీదే అందించడం మరో ప్రత్యేకత.
కుమురంభీం జిల్లాలో.. ఆసిఫాబాద్, సిర్పూర్(టి) నియోజకవర్గంలోని ఆదివాసీలకు పోడు పట్టాలు స్వయంగా పంపిణీ చేశారు కేసీఆర్. పట్టాలతో పాటు రైతుబంధు చెక్కులను కూడా వేదికపైనే అందజేశారు.
పోడు భూములకు పట్టాలు ఇచ్చినందున.. గతంలో అడవులను ఆక్రమించారని గిరిజనులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు సీఎం కేసీఆర్. మారుమూల ప్రాంతాల్లో ఉన్న పోడు భూములకు ఇకపై 3ఫేజ్ కరెంట్ సరఫరా చేస్తామని చెప్పారు. ‘గిరివికాసం’ కింద బోర్లు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనేతరులకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఆసిఫాబాద్ పర్యటనలో భాగంగా.. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ ఆఫీస్ భవనాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కుమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు.