Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రెండో రోజు మణిపూర్ లో పర్యటిస్తున్నారు. అల్లర్ల కారణంగా నిరాశ్రయులైన బాధితులను ఆయన పరామర్శించారు. మణిపూర్లోని మోయిరాంగ్ పట్టణంలోని సహాయ శిబిరాల్లో ఆయన బాధితులతో మాట్లాడారు. వారి సమస్యలను సాదరంగా విన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, చిన్నారులు కన్నీటి పర్యంతమయ్యారు. రాహుల్ వారిని ఓదార్చి.. సరైన న్యాయం జరిగేంతవరకు పోరాడుతామన్నారు.
మరోవైపు రాహుల్ గాంధీ పర్యటనకు మణిపూర్ లోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తోంది. రాహుల్ వెళ్తే మరిన్ని అల్లర్లు జరుగుతాంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. అయితే రాహుల్ గాంధీ రాకను స్వాగతిస్తూ మణిపురీలు మహిళలు రొడ్డెక్కారు. తమ గోడు వినేందుకు వచ్చిన ఆయనకు ఘన స్వాగతం పలికారు. మణిపూర్ లో శాంతిని నెలకొల్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
మరోవైపు, మణిపుర్లో రాహుల్ గాంధీ పర్యటనపై అస్సోం సీఎం హిమంత బిశ్వశర్మ విమర్శలు చేశారు. రాష్ట్రానికి కావాల్సింది శాంతియుతమైన వాతావరణమే కానీ.. రాజకీయ నాయకుల ప్రచారం కాదని అన్నారు. శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని.. ఇలాంటి టైమ్లో రాహుల్ రాష్ట్రానికి వచ్చి పరిస్థితులను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.