Atchutapuram Sez: అనకాపల్లి జిల్లాలో సాహితీ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు రియాక్టర్లు ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయాయి. ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు కార్మికులకు గాయాలయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రమాదం నుంచి 25 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు.
కెమికల్ ల్యాబ్ కావడంతో హానికరమైన పొగ ఇబ్బందిపెడుతోంది. మంటల తీవ్రతకు ఫైర్ సిబ్బంది సైతం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మంటలు, పొగలు భారీగా ఎగసిపడుతుండటంతో.. లోపలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. అగ్ని మాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటలు ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చాకే, లోపల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందని చెబుతున్నారు.
ముందుజాగ్రత్తగా, చుట్టుపక్కల ప్రాంతాల్ని పోలీసులు ఖాళీ చేయించారు. సమీపంలోనే పలు ఫార్మా పరిశ్రమలు ఉండటంతో.. మంటలు వ్యాపించి వాటికీ అంటుకుంటాయేమోననే ఆందోళన వ్యక్తం అవుతోంది. సాహితీ ఫార్మా నుంచి దట్టమైన పొగలు వస్తున్నాయి.