Modi : ప్రధాని మోదీ రూటే సెపరేటు. ఆయన సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారని ఎన్నో సందర్భాలు రుజువు చేశాయి. సామాన్యులతో ముచ్చటించేందుకు ఆసక్తిగా ఉంటారు. తాజాగా మోదీ ఢిల్లీ మెట్రోలో సామాన్యుడిగా ప్రయాణించారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు మెట్రోలోనే వెళ్లారు.
సామాన్య ప్రయాణికుల మాదిరిగానే మెట్రో రైలులో కూర్చుని ప్రయాణించారు. కొందరు విద్యార్థులు, ఇతర ప్రయాణికులతో మాట కలిపారు. వారితో కాసేపు ముచ్చటించారు. వారితో దిగిన ఫొటోలను మోదీ ట్విటర్లో షేర్ చేశారు. బీజేపీ కూడా మోదీ మెట్రో రైలు ప్రయాణ వీడియోను సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
మోదీ ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. 1922లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చట్టం ప్రకారం ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీని యూజీసీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్గా గుర్తించింది. 2022 నాటికి ఈ విశ్వవిద్యాలయానికి వందేళ్లు పూర్తయ్యాయి. గతేడాది మే 1న శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. ఏడాదిపాటు ఈ వేడుకలు నిర్వహించారు. ఇప్పుడు ముగింపు ఉత్సవాలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.