Tamilnadu : తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వానికి గవర్నర్ షాక్ ఇచ్చారు. రాష్ట్ర కేబినెట్ నుంచి సెంథిల్ బాలాజీని తొలగిస్తూ గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఉత్తర్వులు జారీ చేయడంతో వివాదం రాజుకుంది. ఇప్పటికే
తమిళనాడులో గవర్నర్కు, స్టాలిన్ సర్కార్ కు మధ్య వార్ నడుస్తోంది. తాజాగా గవర్నర్ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో మరో వివాదం మొదలైంది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన గవర్నర్.. ఆ తర్వాత కాస్త వెనక్కి తగ్గారు. అటార్నీ జనరల్తో సంప్రదిస్తామని పేర్కొంటూ ఆ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేశారు. అన్నాడీఎంకే హయాంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నగదు తీసుకుని మోసం చేసిన కేసులో ఇటీవల మంత్రి సెంథిల్ బాలాజీ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. ఆ క్రమంలోనే ఆయనను అరెస్టు చేసింది.
సెంథిల్ కు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో సెంథిల్ బాలాజీని కేబినెట్ నుంచి తొలగిస్తూ గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు రాజ్భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. చివరకు అటార్నీ జనరల్తో ఈ అంశాన్ని సంప్రదించి తుది నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఆ ఉత్తర్వులను నిలుపుదల చేసినట్లు గవర్నర్ కార్యాలయం స్పష్టం చేసింది.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి నిర్ణయంపై సీఎం స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ఓ మంత్రిని కేబినెట్ను తొలగించే అధికారం గవర్నర్కు లేదని స్పష్టం చేశారు. ఈ అంశంలో న్యాయపరంగా ముందుకెళతామని చెప్పారు. మంత్రిని తొలగించడాన్ని బీజేపీయేతర ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. గవర్నర్ చర్య పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొన్నాయి. ప్రజాస్వామ్యాన్ని హతమార్చడమేనని మండిపడ్డాయి.