Cabinet : వచ్చే ఏడాది ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది.త్వరలో కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు చేయాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారని తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతోంది. జులై 3న కేబినెట్ భేటీ జరగనుంది. దీంతో మంత్రివర్గంలో మార్పులపై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది.
జూలై 3న కేంద్ర మంత్రి మండలితో సమావేశం జరుగుతుందని అధికారులు ప్రకటించారు. ప్రగతి మైదాన్లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో ఈ సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆ రోజు మంత్రుల మార్పుపై క్లారిటీ వస్తుందంటున్నారు. బుధవారం అర్ధరాత్రి ప్రధాని మోదీ తన నివాసంలో బీజేపీ సీనియర్ నేతలతో సుదీర్ఘ చర్చించారు. లోక్సభ ఎన్నికలకు అమలు చేయాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేశారు. మంత్రిమండలిలో మార్పులపైనా చర్చించారని సమాచారం. కేంద్ర మంత్రుల్లో కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి చోటు కల్పిస్తారని తెలుస్తోంది.
సాధారణంగా పార్లమెంట్ సమావేశాలకు ముందు కేబినెట్ భేటీ జరుగుతుంది.జులై మూడో వారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, రాష్ట్రాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహించారు.
ఈ ఏడాది చివరి నాటికి 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఆ తర్వాత 4 నెలలలోపే లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో సంస్థాగత మార్పులు చేపట్టాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో నాయకత్వ మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో కాషాయ పార్టీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది.