Kidnap Case : విశాఖలో వరుస కిడ్నాప్ లు కలకలం రేపుతున్నాయి. కొన్నిరోజుల క్రితం వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, ఓ ఆడిటర్ కిడ్నాప్ నకు గురయ్యారు. ఈ వ్యవహారం సుఖాంతమైన పెను రాజకీయ దుమారాన్నే రేపింది. ఎంపీ ఫ్యామిలీకే రక్షణ లేదంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఆ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరోసారి విశాఖలో మరో కిడ్నాప్ ఉదంతం వెలుగు చూసింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న దంపతులను దుండగులు కిడ్నాప్ చేశారు. విజయవాడకు చెందిన శ్రీనివాస్, లోవ లక్ష్మి దంపతులు 4 నెలల క్రితం నగరానికి వచ్చారు.నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. ఆ దంపతులను దుండగులు కిడ్నాప్ చేశారు. రూ.60 లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారని బాధితుల బంధువులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని చాకచక్యంగా చేధించారు.
కాకినాడ జిల్లా అన్నవరం మండలం కత్తిపూడి వద్ద ఓ కారును పోలీసులు అడ్డుకున్నారు. అందులో ఉన్న ఐదుగురు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లను విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. శ్రీనివాస్, అతడి భార్య లక్ష్మి సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.
మరోవైపు కిడ్నాప్ నకు గురైన శ్రీనివాస్పై గతంలో విజయవాడ పడమటలో కేసు ఉంది. చీటింగ్ కేసులో జూన్ 2021లో శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.3 కోట్లు కాజేశారని అప్పట్లో కేసు నమోదైంది. కిడ్నాప్ వ్యవహారంలో మరో రియల్టర్ సంస్థ ప్రమేయం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.