Rahul Gandhi tour in Manipur : మణిపూర్లో రాహుల్ గాంధీ పర్యటనకు బ్రేక్ పడింది. ఇంఫాల్ నుంచి చురచంద్పూర్కు బయల్దేరిన రాహుల్ కాన్వాయ్ను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. రాహుల్ కాన్వాయ్ను చూసి స్థానికులు దాడి చేయడానికి వస్తున్నారని అనుమానించే ప్రమాదం ఉందని.. వారు తిరిగి దాడి చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. రాహుల్ భద్రత కోసమే కాన్వాయ్ను అడ్డుకున్నామన్నారు. ఇక్కడి నుంచి ఇక ముందుకు వెళ్లడం సరికాదంటున్నారు పోలీసులు. దీంతో రాహుల్ పర్యటనకు ప్రస్తుతమైతే బ్రేక్ పడినట్టైంది.
రాహుల్ పర్యటించే ప్రాంతంలో బుధవారం రాత్రి అల్లర్లు జరిగాయని.. పరిస్థితి పూర్తిగా అదుపులో లేనందునా ఆ ప్రాంతాన్ని సందర్శించే ఆలోచనను వాయిదా వేసుకోవాలని రాహుల్ను కోరారు పోలీసులు. ఇలాంటి సమయంలో ఆ ప్రాంతంలో పర్యటించడం ఏ మాత్రం సురక్షితం కాదని స్పష్టం చేశారు. న్యూఢిల్లీ నుంచి విమానంలో మణిపూర్ రాజధాని ఇంఫాల్ చేరుకున్న రాహుల్.. చురచంద్పూర్ జిల్లాకు వెళ్లి అక్కడ సహాయ శిబిరాలను సందర్శించి.. నిరాశ్రయులతో మాట్లాడాలని అనుకున్నారు.
మరోవైపు ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో గురవారం ఉదయం గ్రామస్థులపై సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సంఘటనతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. మణిపూర్ లో హింసాకాండ కారణంగా ఇప్పటివరకు కనీసం 115 మంది మరణించారు. 60 వేల మంది వరకు నిరాశ్రయులయ్యారు.