TDP : ఏపీలో మళ్లీ అధికారం సాధించడమే లక్ష్యంగా టీడీపీ వ్యూహరచన చేస్తోంది. అధికార వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్ గా ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి, నాలుగేళ్ల నరకం..రాష్ట్రమా..? రావణ కాష్టమా..? ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతోంది. తాజాగా వైసీపీ మేనిఫెస్టోపై మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “ప్రకాశించని నవరత్నాలు.. జగన్ మోసపు లీలలు” పేరుతో టీడీపీ ఓ పత్రాన్ని రూపొందించింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ పత్రాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు.
సీఎం జగన్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు అమలు చేశామని చెబుతున్నారు. గతంలో అధికారంలో ఉండగా టీడీపీ మేనిఫెస్టోను అమలు చేయలేదని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ విమర్శలకు కౌంటర్ గా టీడీపీ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. వైసీపీ మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు అమలు చేయలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ చెప్పేవన్నీ అసత్యాలేనని.. ఒక్కటీ నిజం ఉండదని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఒకటి చెప్పి.. అధికారంలోకి వచ్చాక మరొకటి చేస్తున్నారని ఆరోపించారు.
అమ్మఒడి కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. రూ.13 వేలు ఇస్తారా? అని అచ్చెన్నాయుడు నిలదీశారు. రాష్ట్రంలో 84 లక్షల మంది అమ్మబడికి అర్హులు ఉంటే కేవలం 42 లక్షల మందికే పథకాన్ని వర్తింపజేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం కార్యక్రమం ద్వారా పిల్లలను చదివించే ప్రతి మహిళకు రూ.15 వేలు ఇస్తామని స్పష్టం చేశారు. గతంలో పింఛన్ రూ.200 నుంచి రూ.2 వేలుకు పెంచింది టీడీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. గతంలో ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా పేదలకు వైద్యసేవలు అందించామన్నారు. గత నాలుగేళ్లలో పేదవాడికి సరైన వైద్యం అందుతోందా? అని అచ్చెన్న నిలదీశారు.
టీడీపీ హయాంలో 74 లక్షల మందికి పింఛన్ ఇచ్చామని అచ్చెన్న వివరించారు. కానీ ప్రస్తుతం 62 లక్షల మందికి ఇస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత 10 లక్షల మందికి పింఛన్లు తొలగించడం వాస్తవం కాదా? అని నిలదీశారు. ఆరోగ్యశ్రీ కింద ఇచ్చిన 8 హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని ఆరోపించారు. జలయజ్ఞం హామీలన్నీ పెండింగ్లోనే ఉన్నాయన్నారు. మద్యం నిషేధం హామీని అమలు చేయలేదని నిలదీశారు.