AP Election News(Andhra pradesh today news): వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఏపీలో.. దొంగ ఓట్ల దుమారం రేగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఓట్ల పంచాయితీ.. పీక్స్ కు చేరింది. పలు నియోజకవర్గాల్లో లక్షలాదిగా దొంగ ఓట్లు నమోదవుతున్నాయంటూ.. ఇటు ప్రతిపక్షం, అటు అధికారపక్షం.. ఆరోపిస్తున్నాయి. బోగస్ ఓట్లు నమోదవడంతో పాటు.. ఉన్న ఓట్లను తొలగిస్తున్నారంటూ.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సరికొత్త వార్ నడుస్తోంది. దీంతో దొంగ ఓట్లు తొలగించాలంటూ.. రెండు పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఓట్లపై గతం నుంచే టీడీపీ పలు ఆరోపణలు చేస్తోంది. ఇందుకు సంబంధించి బూత్ ల వారీగా లెక్కలు చూపిస్తోంది. ఒకే డోర్ నెంబర్ ఉన్న వందల ఓట్లను బయటపెడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో.. ఎన్నికల కమిషన్ ను కలిసిన టీడీపీ నేతలు.. దొంగ ఓట్ల వివరాలను సమర్పించారు. వాటిని వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14 నియోజకవర్గాల్లో ఏకంగా లక్షా 85 వేల దొంగ ఓట్లు నమోదయ్యాయని.. తెలుగుదేశం ప్రధానంగా ఆరోపిస్తోంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలకు చెందిన ఓట్లు తొలగిస్తున్నారని, వైసీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లు కొత్తగా నమోదవుతున్నాయని.. ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థను ఇందుకోసం ఉపయోగిస్తున్నారని.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఇదే అంశంపై అధికార వైసీపీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 68 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని.. వాటిని తొలగించాలని.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వాటి తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణ, దొంగ ఓట్లు తొలగింపు, అర్హులైన వారిని ఓటర్లుగా చేర్పించే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
అయితే అధికార, విపక్షాల మధ్య ఓట్ల పంచాయితీపై ఎన్నికల సంఘం ఉక్కిరిబిక్కిరవుతోంది. వాస్తవానికి ఎవరి ఓటైనా తొలగించాలంటే.. ముందుగా వారికి నోటీసు ఇవ్వాలి. కానీ అలాంటివేమీ జరగకుండానే.. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతవుతున్నాయి. అలాగే అదే సంఖ్యలో.. కొత్త ఓట్లు జాబితాకెక్కుతున్నాయి.