MLA Rajaiah Vs Sarpanch Navya(Telugu news updates): స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య మధ్య వేధింపుల వివాదంలో కొత్త మలుపు తిరిగింది. జానకిపురం గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే రాజయ్య.. 25 లక్షలు మంజూరు చేస్తూ ప్రొసిడింగ్ లెటర్ ఇచ్చారు. దీంతో సర్పంచ్ నవ్య.. ఎమ్మెల్యే రాజయ్యకు ధన్యవాదాలు తెలిపారు. మీడియా సమక్షంలో రాజయ్య ఇచ్చిన ప్రొసిడింగ్ లేఖ చూపించి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు సర్పంచ్ నవ్య.
అయితే గ్రామాభివృద్ధికి నిధులు ఇచ్చినంత మాత్రాన.. ఎమ్మెల్యే రాజయ్యపై తన పోరాటం ఆపబోనన్నారు సర్పంచ్ నవ్య. రాజకీయాలు వేరు.. వ్యక్తిగత జీవితం వేరని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మంజూరు చేసిన 25 లక్షల రూపాయలను గ్రామాభివృద్ధికే ఖర్చు చేస్తానని ఆమె తెలిపారు.
ఇక ఎమ్మెల్యే రాజయ్య వద్ద తన భర్త తీసుకున్న ఏడు లక్షల రూపాయలను.. ఏదైనా అమ్మి తిరిగి ఇచ్చేయాలని భర్తకు ఆల్టిమేటం ఇచ్చారు. తల తాకట్టు పెట్టైనా. రూ. 7 లక్షలు భర్త తిరిగి చెల్లించాల్సిందేనని సూచించారు. నిజాయితీగా ఎమ్మెల్యే వేధింపులపై పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఆధారాలతో మహిళా కమిషన్ను ఆశ్రయిస్తానని సర్పంచ్ నవ్య తేల్చి చెప్పారు.