Fishing Nets: చేపలు పట్టే వారికి రోజూ కత్తి మీద సాము లాగా ఉంటుందని అంటుంటారు. ఆరోజు చేపలు పట్టడానికి వెళ్లినవారికి కచ్చితంగా చేపలు పడతాయా లేదా చెప్పలేం. కానీ ఒక్కొక్కసారి చేపల వేటకు వెళ్లినప్పుడు తిమింగలాలు లాంటివి కూడా ఆ వలలో పడి మత్స్యకారులను ఇబ్బందులకు గురిచేస్తాయి. ఒక్కొక్కసారి ఇలాంటివి వారి ప్రాణాలకు ముప్పును కూడా కలిగిస్తాయి. అలాంటి సమస్యల నుండి వారిని తప్పించడం కోసమే కొత్త రకమైన చేప వల సిద్ధమవుతోంది.
ఒక రోబోటిక్ డివైజ్ను నీటిలోకి పంపించడం ద్వారా చేప వలలో పడింది ఎలాంటి నీటి జంతువు అని జాలరులకు తెలిసేలా చేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది రియల్ టైమ్ సమాచారాన్ని అందిస్తుందని వారు అంటున్నారు. ఈ టెక్నాలజీ పేరు స్మార్ట్రాల్. ఇది ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చేప వలలో పడిన వాటి గురించి సమాచారాన్ని అందిస్తుంది. అంతే కాకుండా దీనికి ఒక స్టీరియో కెమెరా కూడా అటాచ్ చేసి ఉంటుంది. దీని ద్వారా దాని ఫోటోలు కూడా ఎప్పటికప్పుడు జాలరులు చూడగలరు. దీంతో ఆ నీటి జంతువు వల్ల వారికి ప్రమాదం ఉందో లేదో తెలుసుకోవచ్చు.
ఏఐ ద్వారా స్మార్ట్రాల్ను ఉపయోగించి ఫిషింగ్ చేయడం ద్వారా బైక్యాచ్ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బైక్యాచ్ కారణంగా ఎంతోమంది మత్స్యకారులు కన్నుమూస్తున్నారు. అంతే కాకుండా ఒకసారి వలలో చిక్కిన తర్వాత అతి అవసరం లేని చేప లేదా నీటి జంతువు అని తెలుసుకున్న మత్స్యకారుడు తిరిగి దానిని నీటిలో వదిలేస్తాడు. కానీ అలాంటి సందర్భాల్లో చాలావరకు ఆ నీటి జంతువు బ్రతికి ఉండదు. ప్రపంచవ్యాప్తంగా 46 శాతం చేపలు ఇలా బైక్యాచ్ వల్లే చనిపోతున్నాయని సర్వేలో తేలింది.
ఈ టెక్నాలజీకి సంబంధించి ఇప్పటికే పలు సముద్రాల వద్ద ట్రయల్స్ జరిగాయి. ఆ ట్రయల్స్ను చూస్తుంటే వారి ప్రయోగాలు సక్సెస్ అయినట్టు తెలుస్తుందని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బైక్యాచ్ వల్ల నీటి జంతువుల నుండి మత్స్యకారులకు జరిగే ప్రమాదాలను, మత్స్యకారుల నుండి నీటి జంతువులకు, చేపలకు జరిగే ప్రమాదాలను నివారంచడానికే ఈ స్మార్ట్రాల్ను తయారు చేసినట్టు దీని సృష్టికర్త పాల్ ఫెర్నాండెస్ బయటపెట్టారు. ఈ టెక్నాలజీ ఆచరణలోకి వస్తే చాలావరకు చేపలు అనవసరంగా చనిపోవడం చాలావరకు తగ్గిపోతుందని ఆశిస్తున్నారు.