Ai in video games: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతీ రంగంలో ఉద్యోగులకు సాయం చేస్తూ ముందుకెళ్తోంది. ఏఐ వల్ల మనుషుల ఉద్యోగాలకు రిస్క్ అని అంటున్నా కూడా సంస్థలు మాత్రం తక్కువ సమయంలో ఎక్కువ పని అయిపోయే మార్గాన్నే ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటివరకు ఏఐ అడుగుపెట్టని ఒకే ఒక రంగం గేమింగ్. తాజాగా గేమింగ్ ఇండస్ట్రీలోని రెండు దిగ్గజ సంస్థలు కూడా ఏఐ సాయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి.
మామూలుగా వీడియో గేమింగ్ సెక్టార్ అనేది కోట్లలో నడిచే బిజినెస్. ఒక గేమ్ను డిజైన్ చేయడం దగ్గర నుండి అది యూజర్ల దగ్గరకు చేరే వరకు ఎన్నో ప్రక్రియలు ఉంటాయి. అవన్నీ ఖర్చుతో కూడుకున్నవే. అందుకే ఏఐ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ సాయం తీసుకోవడం ద్వారా తమ మల్టీ మిలియన్ డాలర్ బడ్జెట్ను తగ్గించుకోవాలని సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. డైలాగ్స్, క్యారెక్టర్స్, ల్యాండ్స్కేప్స్.. ఇలాంటివి డిజైన్ చేసే విషయంలో ఏఐ సాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఏఐ తయారు చేసే డిజైన్స్కు, క్యారెక్టర్స్కు ప్లేయర్స్ బాగా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాయి.
ఇప్పటికే యూనిటీ సాఫ్ట్వేర్ అనే దిగ్గజ సంస్థ.. భవిష్యత్తులో గేమ్ డిజైనింగ్ కోసం ఏఐ సాయం తీసుకోవాలని నిర్ణయాన్ని ప్రకటించింది. అంతే కాకుండా కొన్ని ట్రయల్ ప్రొడక్ట్స్ను కూడా లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ సంస్థలో భాగమయిన ప్లేయర్స్ ఈ ప్రొడక్ట్స్ను ట్రై చేసి చూడవచ్చని చెప్పింది. దీంతో ఒకటేసారి ఆ సంస్థ షేర్ ప్రైజ్ 15 శాతానికి పెరిగిపోయింది. ఇదే విధంగా చైనాకు చెందిన నెట్ఈజ్ అనే సంస్థ కూడా జస్టిస్ మొబైల్ అనే పేరుతో ఏఐ తయారు చేసిన క్యారెక్టర్లతో ఒకే గేమ్ను తమ ప్లేయర్స్కు అందించనుంది.
జస్టిస్ మొబైల్ అనేది పూర్తిగా ఏఐ అప్లికేషన్తో తయారైన మొదటి మెయిన్స్ట్రీమ్ గేమ్. త్వరలోనే ఈ గేమ్ అందరి ప్లే స్టోర్లోకి రానుంది. చాట్జీపీటీ, గూగుల్ బార్డ్ లాంటి ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ లాగానే పూర్తిగా గేమింగ్కు సపోర్ట్ చేసే లాంగ్వేజ్ మోడల్ను తయారు చేయాలని సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక గేమింగ్ ఇండస్ట్రీలో కూడా ఏఐ సక్సెస్ఫుల్గా అడుగుపెట్టడంతో మిగతా వీడియో గేమింగ్ సంస్థలు కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించి కొత్త కొత్త గేమ్స్తో ప్లేయర్స్ను ఆకట్టుకోవాలని భావిస్తున్నాయి.