Telangana BJP latest news(Telugu breaking news today): ఇన్నాళ్లూ ఫ్రంట్ లైన్లో ఉన్నట్టు కనిపించింది. ఇప్పుడు రేసులో బాగా వెనకబడింది. మునుపటి దూకుడు లేదు. ఆ పదునూ లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తోంది. అనేక కారణాలతో కమల వికాసం వాడిపోయింది. కీలకమైన ఎన్నికల సమయంలో ఎందుకీ నిరుత్సాహం? ఎక్కడ ప్రణాళికా లోపం? ముందుచూపు కరువైందా? యాక్షన్ ప్లానే లేకుండా పోయిందా? బీజేపీ జాతీయ నేతల వైఫల్యమా? బాధ్యతంతా రాష్ట్ర నేతల నెత్తిన పెట్టేసి.. ఢిల్లీ బీజేపీ తెలంగాణను పట్టించుకోకపోవడమే ఈ దుస్థితికి కారణమా? అనే చర్చ జరుగుతోంది.
బాహుబలి గెలవని దక్షిణాది..
2014, 2019.. వరుసగా రెండు పర్యాయాలు అఖండ మెజార్టీతో కేంద్రంలో కొలువుదీరింది బీజేపీ. భారీ మెజార్టీతో బాహుబలిలా మారిన కమలదళం.. ఇక యావత్ దేశాన్ని కమ్మేస్తుందని అనిపించింది. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో తిరుగులేదు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటకలో.. సక్సెస్ఫుల్గా అధికారం లాక్కున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో గెలిచి నిలిచారు. అయితే, తెలంగాణలో మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారనే అంటున్నారు. తొమ్మిదేళ్లుగా పక్కా ప్లాన్డ్గా లేకపోవడం వల్లే.. ఇప్పటికీ 119 స్థానాల్లో బలమైన అభ్యర్థులు దొరకని దుస్థితి దాపురించిందా?
రేవంత్రెడ్డి ఎఫెక్ట్!
2019 తొలినాళ్లలోనూ వారిద్దరి జోరు మామూలుగా లేదు. కరోనా సమయంలో మోదీకి ఫుట్ సపోర్ట్ చేశారు గులాబీ బాస్. కొవ్వొత్తులు వెలిగించారు.. చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత స్టార్ట్ అయింది అసలు రాజకీయం. ఆ తర్వాత కాలంలో రేవంత్రెడ్డి చేతికి పీసీసీ పగ్గాలు రావడంతో.. ప్లాన్-బి స్టార్ట్ చేశారు కేసీఆర్. బీజేపీని టార్గెట్ చేసి.. కాంగ్రెస్ను మైనస్ చేశారు. అయితే, గోడకు కొట్టిన బంతిలా ఎగిసిన హస్తం పార్టీ.. ఇప్పుడు బీజేపీని వెనక్కినెట్టి.. కేసీఆర్తో తాడోపేడో తేల్చుకునేందుకు సై అంటోంది. బీఆర్ఎస్, బీజేపీ రెండూ మిలాకత్ అనే ముద్ర ప్రజల్లో బలంగా పడింది.
తొమ్మిదేళ్ల తప్పిదమా?
అంతా బీజేపీ తప్పిదమే అంటున్నారు. తొమ్మిదేళ్ల నుంచి కేసీఆర్ను టార్గెట్ చేసి ఉంటే.. తెలంగాణపై అధిక ఫోకస్ చేసుంటే.. ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదంటున్నారు. ఇన్నేళ్లలో మోదీ కానీ, అమిత్ షా కానీ.. తెలంగాణ పర్యటనలకు వచ్చింది కొన్నిసార్లే. ఎందుకోగాని దక్షిణాదిని అంతగా పట్టించుకోలేదు కమలనాథులు. అందుకే, ఇప్పుడీ చేదు ఫలితాలు. కర్నాటకను సైతం కోల్పోవడంతో.. ఇక ఆగమాగం అవుతోంది. అర్జెంటుగా తెలంగాణపై ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. ఈలోగా పార్టీ ఎంత డ్యామేజ్ కావాలో అంతకంటే ఎక్కువే అయింది. పార్టీలో చేరికలు ఆగిపోయాయి. గ్రూపులు తయారయ్యాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఆలస్యంగా హడావుడి పెంచితే ఏం లాభం? బండి, ఈటల, కిషన్రెడ్డిలతో ఇప్పుడీ మీటింగులతో ఏం ఉపయోగం? అంటున్నారు.
ఆపరేషన్ ఆకర్ష్తో వికర్ష్..
అమిత్షాను బీజేపీ కింగ్ మేకర్ అంటారు. ఆయన వల్లే యూపీ మొత్తం కాషాయమయంగా మారింది. గులాబీవనం నుంచి ఒక్క బడా నేతనైనా లాగలేకపోయారు. బీఎస్ సంతోష్ పేరు చెప్పి.. పైలట్ రోహిత్రెడ్డికి ఎర వేసి ఓ ప్రయత్నం చేసినా అది బెడిసికొట్టి కోర్టు స్టేతో బతికి బట్టకట్టింది. కనీసం, కారు నుంచి పంపించేసిన.. పొంగులేటి, జూపల్లిలకైనా కాషాయ కండువా కప్పలేకపోయారు. అంత పవర్ ఉండి ఏం ప్రయోజనం? అమిత్షా చాణక్యం తెలంగాణలో పని చేయకుండా పోతోందా? అనే అనుమానం.
కర్నాటకలో చేతులు కాలాక.. ఇప్పుడు తెలంగాణలో ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కమలం పెద్దలు. ఇదేదో తొమ్మిదేళ్లుగా చేసుంటే.. పార్టీని బలోపేతం చేసుంటే.. బలమైన నాయకులను తయారు చేసుంటే.. ఇప్పుడిలా మల్లగుల్లాలు పడే అవస్థ ఉండేదా? మిగతా రాష్ట్రాలపై చూపించినంత ఇంట్రెస్ట్.. తెలంగాణపై పెట్టకపోవడమే కారణమా?
కవిత కేసులో రాజకీయ తప్పిదమా?
బీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య అవగాహన ఉందనే అనుమానమైతే ఉంది. కేసీఆర్ అడగ్గానే ముందస్తుకు ఓకే చెప్పేశారు. కేసీఆర్ అడక్కున్నా.. కవితను అరెస్ట్ చేయకుండా వదిలేశారు. అంటే, ఆ రెండు పార్టీల మధ్య సంథింగ్ సంథింగ్ అన్నట్టేగా..అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేసుంటే.. బీజేపీని ఇంతగా అనుమానించేవారు కాదేమో. ఒక్క అరెస్ట్.. ఒకే ఒక్క అరెస్ట్తో.. అంతా రాజకీయం మొత్తం మారిపోయే ఛాన్స్ ఉండేది. పొంగులేటి, జూపల్లిలు బీజేపీకే జై కొట్టుండేవారు. కానీ, ఆ ఒక్క అరెస్టే చేయలేని కేంద్రంలోని బీజేపీని ఎవరు నమ్ముతారు? అని అంటున్నారు.
కేసీఆర్ను తక్కువ అంచనా వేశారా?
కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్కు ఏటీఎంగా మారిందంటూ బీజేపీ పెద్దలు పదే పదే ఆరోపించారు. కేవలం ఆరోపణలతోనే సరిపెట్టకుండా.. కనీసం ఓ ఎంక్వైరీ అయినా వేసుంటే నమ్మేవారేమో. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్నారని అంటున్నారే కానీ.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమూ అనుమానాస్పదమే. అన్ని డౌట్స్కూ బీజేపీ విధానాలే కారణంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఎక్కడ కాంగ్రెస్ ఎదిగిపోతుందో అనే టెన్షన్తో తెలంగాణపై హైరానా పడుతున్నారు కమలనాథులు. అయితే, తెలంగాణ చాణిక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్.. బీజేపీని ఈజీగా బుట్టలో వేసుకున్నారని అంటున్నారు. గతంలో ప్రత్యేక రాష్ట్రం ఇస్తే పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తానని మాటిచ్చి.. నట్టేట ముంచిన రాజకీయ చరిత్ర గులాబీ బాస్ది. అలాంటి కేసీఆర్ను తక్కువ అంచనా వేసి.. కాస్త మెతక వైఖరి అవలంభించడంతో ఇప్పుడు పార్టీ ఆగమయ్యే పరిస్థితికి పతనమైందని చెబుతున్నారు. ఎన్నికలకు గట్టిగా నాలుగు నెలలే టైమ్ ఉన్న పరిస్థితిలో.. ఆఖరి సమయంలో ఇప్పుడు అధ్యక్షుడిని మారిస్తే సరిపోతుందా? బీజేపీ గెలుపు గుర్రంగా మారుతుందా? అంతా మోదీ, షా వైఫల్యమేనా? చేసుకున్నోళ్లకు చేసుకున్నంతా?