Black Magic News(Andhra news today): కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో క్షుద్రపూజలు.. తీవ్ర కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి గ్రామంలోని మామిడి తోటల్లో కొందరు వ్యక్తులు పెద్ద ఎత్తున క్షుద్రపూజలు నిర్వహించారు. సినిమాల్లో చూపించే విధంగా.. పెద్ద ఎత్తున సెట్టింగ్ వేసి క్షుద్రపూజలు నిర్వహించినట్లు కనిపిస్తోంది. విగ్రహాలను ఏర్పాటు చేసి వాటి ముందు పసుపు, కుంకుమతో పెద్ద ఎత్తున ముగ్గులు వేశారు. ముగ్గు మధ్యలో మనిషి ఆకారంలో బొమ్మను గీసి.. పూజలు చేసినట్లు తెలుస్తుంది.
తమిళనాడు, తెలంగాణ రిజిస్ట్రేషన్ తో ఉన్న 5 కార్లలో 20 మంది చేరుకుని ఈ పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పూజలు పూర్తి కాగానే.. రెండు కార్లలో కొందరు తమిళనాడుకు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. అయితే ఎవరు ఈ పూజలు నిర్వహించారనే దానిపై క్లారిటీ లేకపోయినా.. అసలు క్షుద్రపూజలేవీ జరగలేవని పోలీసులు తేల్చిచెబుతున్నారు. విచారణ జరుపుతున్నామని.. ఏదైనా తెలిసిన తర్వాతే మాట్లాడుతామని.. వివరిస్తున్నారు. ఇటు ఇంత పెద్ద ఎత్తున క్షుద్రపూజలు జరగడంతో.. వాటికి సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.