PM Modi : అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోడీ కుదుర్చుకున్న ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందంలో లొసుగులున్నాయని.. అందుకోసం భారీ వ్యయాన్ని ఖర్చు చేస్తున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఇతర దేశాల కంటే ఎక్కువ ధర చెల్లిస్తున్నారన్న కాంగ్రెస్.. మరో రాఫెల్ ఒప్పందంతో పోల్చి ప్రశ్నిస్తోంది.
ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా ఎక్కువ చెల్లిస్తోందన్న కాంగ్రెస్.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లేని డ్రోన్కు అత్యధిక ధర ఎందుకు చెల్లిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ఆ పార్టీ నాయకులు నిలదీస్తున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశాంగ శాఖ లేకుండా.. ప్రధాని ఏకపక్షంగా ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం ఎలా కుదుర్చుకుంటారని ప్రశ్నలు సంధించారు.
దేశ రక్షణ రంగంలోకి శతృ సైన్యాన్ని వేటాడే ప్రిడేటర్ డ్రోన్లను అందించేందుకు భారత ప్రభుత్వం కొంతకాలంగా కృషి చేస్తోంది. ఇందుకోసం ఇటీవల అమెరికా పర్యటనలో ప్రధాని మోడీ.. ఆ దేశ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తం 31 డ్రోన్లను 6 నుంచి 7 ఏళ్లలో.. దశల వారీగా రక్షణదళాల్లోకి చేర్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం దాదాపు 29 వేల కోట్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రక్రియను వచ్చే జులై మొదటి వారంలోనే ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతున్న సమయంలో.. ఒప్పందంపై కాంగ్రెస్ అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. రెండు నెలల క్రితం 18 డ్రోన్లు కావాలన్న కేంద్రం.. అంతలోనే 31 డ్రోన్లను ఎందుకు కొనుగోలు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇది మరో రాఫెల్ ఉదంతాన్ని గుర్తు చేస్తుందని.. ఇందులో భారీ స్కామ్ జరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తోంది.