Srikakulam Rims : శ్రీకాకుళం రిమ్స్ RMO శంకర్రావు.. తానొక వైద్యాధికారినని మరిచి రెచ్చిపోయారు. మీడియా పట్ల దురుషుగా ప్రవర్తించి వీరంగం సృష్టించారు. తొడకొడుతూ ఏం చేసుకుంటారో చేసుకోండంటూ పేట్రేగిపోయారు. చివరకు మహిళా పారిశుద్ధ్య కార్మికులు సైతం RMO తీరుపై దుమ్మేత్తిపోస్తున్నారు. తమతోనూ అసభ్యకర మాటలు, చేష్టలతో ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఇలాంటి వ్యక్తి ఆస్పత్రిలో ఉంటే పనిచేయలేమంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఎచ్చెర్ల మండలం కుప్పిలిలో ఓ తండ్రి కన్న కొడుకునే అతి కిరాతకంగా నరికి చంపేశాడు. మిగతా కుటుంబ సభ్యులనూ చంపేందుకు యత్నించగా.. వారంతా కేకలు వేయడంతో తండ్రి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన పెద్దకుమారుడు తాతారావు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యకు భార్యపై అనుమానమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. అర్ధరాత్రి జరిగిన ఘటన.. స్థానికంగా కలకలం రేపింది.
సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. అయితే ఈ ఘటనను చిత్రీకరించేందుకు ఆస్పత్రికి వెళ్లిన మీడియాపై ఆర్ఎంవో.. అధికార మదంతో రెచ్చిపోయారు. అనుమతి లేదంటూ గేటు వద్దే మీడియాను పోలీసులతో అడ్డగించి నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఏం చేసుకుంటారో చేసుకొండంటూ తొడకొడుతూ మీడియా ప్రతినిధులను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లా వాసులు వెనుకబడినవారంటూ దూషించారు. తనను ఎవరూ ఏం చేయలేరంటూ విర్రవీగారు. RMO ప్రవర్తనపై మీడియా ప్రతినిధులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అటు RMOపై రిమ్స్ ఆస్పత్రి మహిళా పారిశుద్ధ్య కార్మికులు కూడా మండిపడుతున్నారు. మహిళా కార్మికులతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. కొంతమంది వైద్యులు తమకు సపోర్ట్ చేస్తే.. వారిని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. పనిచేసే ఆడవాళ్లతో బూతులు మాట్లాడుతున్నారని తెలిపారు. RMO ప్రవర్తనపై ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదని వాపోయారు. ఇక్కడ పనిచేయాలంటేనే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే RMO సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.