Mind Uploading: ఇప్పటికే మనిషి మెదడులోని ఆలోచనలను కనిపెట్టడానికి, ఆ ఆలోచనలను మాట రూపంలో మార్చడానికి.. ఎన్నో టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా మెదడుకు సంబంధించి ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవడానికి కూడా ఉన్నాయి. ముఖ్యంగా మెదడుకు సంబంధించి ఏం తెలుసుకోవాలన్నా అందులో కంప్యూటర్ కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా ఈ కంప్యూటర్, బ్రెయిన్ మధ్య కనెక్షన్ను మరింత పెంచే ప్రయత్నం చేశారు శాస్త్రవేత్తలు.
మనిషి చనిపోయినా కూడా తన మెదడు చనిపోదు అనే విషయాన్ని చాలామంది శాస్త్రవేత్తలు నమ్ముతారు. శరీరం మరణించినా కూడా మనిషి మెదడు, అందులోని ఆలోచనలు ఇంకొక రూపంలోకి మారుతాయని అంటుంటారు. 1950ల్లోనే ఈ ఆలోచన చాలామందికి వచ్చినా దీనిపై చేసిన ప్రయోగాలు ఏవీ పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. మైండ్ అప్లోడింగ్ అనే ఈ కాన్సెప్ట్పై ఎన్ని ప్రయోగాలు జరిగినా అవి కొంతవరకే సక్సెస్ అవుతున్నాయి. సినిమాల్లో, టీవీల్లో చూపించినట్టుగా మైండ్ అప్లోడింగ్ ప్రాసెస్ అంత సులభం కాదంటున్నారు శాస్త్రవేత్తలు.
పెరుగుతున్న టెక్నాలజీల వల్ల తాము మైండ్ అప్లోడింగ్కు దగ్గరగా వచ్చామని శాస్త్రవేత్తలు తాజాగా తెలిపారు. మన మెదడును, అందులోని గుర్తులను కంప్యూటర్లో స్టోర్ చేయడం ద్వారా మైండ్ అప్లోడింగ్ ప్రక్రియ సక్సెస్ అయ్యే అవకాశం ఉందని ఒక శాస్త్రవేత్తకు ఆలోచన వచ్చింది. ఆ ప్రయోగం చేయడానికి తానే స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు కూడా. తన అంచనా ప్రకారం 2045లోపు మైండ్ అప్లోడింగ్ అనేది సక్సెస్ అవుతుందని అనుకున్నాడు. కానీ అంతలోపు ఇది జరగకపోయినా అతడు ఇచ్చిన ఐడియాతోనే మెల్లమెల్లగా మైండ్ అప్లోడింగ్ను సక్సెస్ చేస్తామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
మైండ్ అప్లోడింగ్ను సాధించాలంటే ముందుగా మెదడు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ తర్వాత కంప్యూటర్లోకి మెదడుకు సంబంధించిన సమాచారాన్ని పంపించాలి. దీనికోసం పలు ప్రక్రియలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. స్కాన్ అండ్ కాపీ లాంటి ప్రక్రియతో ముందుగా ప్రయోగాలు చేయాలని వారు నిర్ణయించుకున్నారు. ముందుగా మెదడులోని సమాచారాన్ని అంతా స్కాన్ చేసి, దానిని కంప్యూటర్లోకి పంపించాలి. వినడానికి సులభంగా ఉన్నా.. ఈ ప్రక్రియకు చాలా కష్టపడాలి అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది కాకపోతే మరికొన్ని ప్రక్రియలతో మైండ్ అప్లోడింగ్పై ప్రయోగాలు చేస్తామని చెప్తున్నారు.