Telangana congress news(Latest breaking news in telugu): “కర్నాటకలో ఓ ఇద్దరిపై వేటు వేద్దాం అనుకున్నాం.. కానీ మిస్ అయ్యారు.. తెలంగాణలో ఓ ఇద్దరు దొరికేలా ఉన్నారు”.. ఇదీ రాహుల్ గాంధీ వార్నింగ్.
“అధికారం కావాలా? మీడియాలో ఉండాలా? ఇద్దరిపై వేటు వేస్తే అంతా సెట్ అవుతుంది.. మా దగ్గర వారిపై రిపోర్టులు ఉన్నాయి”.. ఇవీ మల్లికార్జున ఖర్గే హెచ్చరికలు.
ఢిల్లీలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశానికి సంబంధించిన వివరాలు బయటకు వస్తున్నాయి. కాస్త హాట్ హాట్గానే ఈ మీటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణ నేతలంతా అధిష్టానానికి చెప్పాల్సింది చెప్పారు.. రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. అంతా విన్న హైకమాండ్.. తాము చేయాల్సింది చేస్తామంటూనే.. కొందరు నేతల తీరును తీవ్రంగా తప్పుబట్టినట్టు సమాచారం.
మెయిన్గా కొందరు నేతలు మీడియాకు ఎక్కి రచ్చ చేయడంపై రాహుల్, ఖర్గేలు మండిపడ్డారట. ఏవైనా సమస్యలు ఉంటే.. ముందు అధిష్టానానికి చెప్పండి.. తాము వినకపోతే.. అప్పుడు మీడియా ముందుకు వెళ్లండి. అంతేగానీ ప్రతీసారి మీడియాలో రచ్చ చేస్తే.. ఈసారి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంలోనే ఓ ఇద్దరు నేతలకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తీరు మార్చుకోకపోతే.. వేటు తప్పదని.. కర్నాటకలో అలానే చేశామని.. వారిపై తమ దగ్గర పూర్తి వివరాలతో రిపోర్టులు ఉన్నాయని.. పార్టీకి ఎవరెంత చేశారో తెలుసుంటూ.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని.. సూటిగా చెప్పారట రాహుల్, ఖర్గేలు.
ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? అనే చర్చ మొదలైంది నేతల్లో. ఆ ఇద్దరిలో మొదటిపేరు కోమటిరెడ్డి వెంకట్రెడ్డిదే వినిపిస్తోంది. గతంలో బహిరంగంగా పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలెన్నో చేశారు కోమటిరెడ్డి. రేవంత్కు పీసీసీ చీఫ్ పదవి రావడంపై ఆరోపణలు.. మునుగోడులో తన సోదరుడికే ఓటు వేయాలంటూ కామెంట్లు.. కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు తప్పదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు.. కేంద్ర మంత్రులను కలవడాలు.. ఇలా వెంకట్రెడ్డి వ్యవహారం పార్టీలో కల్లోలం రేపింది. ఓసారి షోకాజ్ నోటీసులు కూడా అందుకున్నారు. అయితే, మునుగోడులో బీజేపీ ఓటమి, కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత.. కోమటిరెడ్డిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. రేవంత్రెడ్డితో కలిసిపోతున్నారు.
ఇక, రాహుల్ వార్నింగ్ ఇచ్చిన ఇంకో నాయకుడు ఎవరై ఉంటారు? అది జగ్గారెడ్డినా? ఉత్తమ్కుమార్రెడ్డినా? తాజా మీటింగ్లో జగ్గారెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడారు జగ్గారెడ్డి. ఆయన చెప్పిందంతా విన్నారు. మీడియాతో జాగ్రత్త అని జగ్గారెడ్డికి సూచించారు రాహుల్.
ఇక ఉత్తమ్.. పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అన్నిమీడియాల్లోనూ ఆ మేరకు వార్తలు వస్తున్నాయి. గతంలో ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరైన కవితకు మద్దతుగా వెళ్లిన మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు.. హస్తినలోని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లోనే ఆతిథ్యం తీసుకున్నారంటూ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్లో ఫోటోలతో సహా వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను ఉత్తమ్ రెడ్డి.. ఎప్పటికప్పుడూ ఖండిస్తూ వస్తున్నారు.
రాహుల్, ఖర్గేల హెచ్చరికల తర్వాతైనా కొందరు కాంగ్రెస్ నేతలు తీరు మార్చుకుంటారా? అంతా ఐకమత్యంగా ఎన్నికల సంగ్రామంలో పోరాడుతారా? కేసీఆర్ను గద్దె దించడంలో హస్తం నేతలంతా చేతులు కలుపుతారా?