Manipur News : మణిపూర్లో జరుగుతున్న హింసను అదుపు చేసేందుకు ప్రజలు సహకరించాలని ఇండియన్ ఆర్మీ విజ్ఞప్తి చేసింది. శాంతి స్థాపన కోసం తాము చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆర్మీ కోరింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో గత రెండు నెలల నుంచి రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో హింస చెలరేగుతోంది. దీనిని ఆపేందుకు ఇండియన్ ఆర్మీ చేపడుతున్న జవాన్లకు.. మహిళలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. మహిళలు కావాలని అల్లర్లు సృష్టించే వారికి సహకారం అందిస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఓ ప్రత్యేక వీడియోను ఆర్మీ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. తమ మానవత్వాన్ని బలహీనతగా అస్సలు భావించవద్దని తెలిపింది. తాము మణిపూర్కు సహాయం చేయాలంటే.. మణిపూర్ ప్రజలు తమకు సహాయం చేయాలని కోరింది ఇండియన్ ఆర్మీ.
మణిపూర్లో జరుగుతున్న హింసను అదుపు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే గత రెండు నెలలుగా ప్రభుత్వాల ప్రయత్నాలు సఫలం కావడం లేదు. చర్చలు జరిగినట్టు జరుగుతూనే ఉన్నాయి.. తిరిగి హింస చెలరేగుతోంది. గత మే నెల 3 నుంచి మణిపూర్ రావణకాష్టంలాగా మండుతూనే ఉంది. ఇంతకాలం ప్రయత్నం చేసిన ఇండియన్ ఆర్మీ ఇప్పుడు హింసను అదుపు చేయడానికి ప్రజలు సహకరించాలని ట్విట్టర్ వేదికగా కోరుతోంది. మరీ ప్రజలు ఆర్మీ విజ్ఞప్తిని అంగీకరిస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఇటీవల ఇంఫాల్ లోని ఓ గ్రామంలో సోదాలు జరిపి పట్టుకున్న 12 మంది మిలిటెంట్లను మహిళలు ఆందోళన చేయడంతో విడిచి పెట్టాల్సి వచ్చింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆర్మీ వెనక్కి తగ్గక తప్పలేదు. 2015 లో డోగ్రా యూనిట్ పై జరిగిన దాడిలో ఈ బృందం హస్తం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మిలిటెంట్లను విడిచిపెట్టాలంటూ సుమారు 1500 మంది మహిళలు సైనికులను ముందుకు కదలనివ్వలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు. గంటల తరబడి అలాగే అడ్డుకున్నారు. దాదాపు రోజంతా ప్రతిష్టంభన కొనసాగింది. చివరకు సైన్యం వెనక్కి తగ్గి, 12 మంది మిలిటెంట్లను విడిచిపెట్టింది. ఆయుధాలను మాత్రం అక్కడి నుంచి తరలించినట్లు సైనిక అధికారులు ప్రకటించారు. ఈ ఘటనతో పాటు అనేక ఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈ విజ్ఞప్తిని చేసినట్టు తెలస్తోంది.
మణిపూర్లో ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి 11 వందల ఆయుధాలతో పాటు 13 వేల 702 మందుగుండు సామగ్రి, 250 బాంబులను రికవరీ చేసుకున్నారు. పోలీసుస్టేషన్లు, ఆయుధాల స్టోర్ నుంచి ఎన్ని అయుధాలు లూటీకి గురయ్యాయనే దానిపై అధికారుల వద్ద స్పష్టత లేదు.