PM Modi latest speech(Telugu breaking news today): మధ్యప్రదేశ్ భోపాల్లో బీజేపీ మీటింగ్. ‘మేరా బూత్.. సబ్సే మజ్బూత్’ ప్రోగ్రామ్. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. వాళ్లు వాళ్లు ఏదో బీజేపీ విషయాలు మాట్లాడుకుంటుండగా.. మధ్యలో సడెన్గా బీఆర్ఎస్, కవిత టాపిక్ తీసుకొచ్చారు మోదీ.
కేసీఆర్ కూతురు కవిత బాగుండాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలని.. మీరు, మీ పిల్లలు బాగుండాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపిచ్చారు ప్రధాని మోదీ. కుటుంబ పార్టీలు అధికారంలోకి వస్తే.. వారి కుటుంబ ప్రయోజనం కోసమే పనిచేస్తాయని విమర్శించారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేసే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాట్నాలో భేటీ అయిన విపక్ష కూటమిని.. దొంగల ముఠాగా అభివర్ణించారు. ఆ పార్టీలన్నీ అవినీతి, కుంభకోణాలకు హామీ ఇస్తాయి. తాను మాత్రం అవినీతిపరులను వదిలిపెట్టేదే లేదని హామీ ఇస్తున్నా.. అన్నారు మోదీ. బుజ్జగింపులు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకూడదని బీజేపీ నిర్ణయించుకున్నట్టు ప్రధాని మోదీ చెప్పారు.
మోదీ వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. బుజ్జగింపులు ఉండవని.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయమని చెప్పారంటే.. ఇక కవిత అరెస్టేననే సిగ్నల్ ఇచ్చారా? అవసరం లేకున్నా, అది సందర్భం కాకున్నా కవిత పేరు ప్రస్తావించి వార్నింగ్ బెల్ మోగించారా? అనే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్నో, కేసీఆర్నో విమర్శిస్తే అది వేరేలా ఉండేది. కానీ, మోదీ నేరుగా కవిత పేరును ప్రస్తావించడం వ్యూహాత్మకమే అంటున్నారు.
కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. చేరికల సంగతేమో కానీ.. ఉన్న నాయకులే వెళ్లిపోయే పరిస్థితి వచ్చిపడింది. ఇటీవలే ఈటలను, రాజగోపాల్రెడ్డిని ఢిల్లీకి పిలిపించి మరీ బుజ్జగించి పంపించారు. పొంగులేటి, జూపల్లిలను మిస్ చేసుకున్నారు. అటు, బీజేపీ-బీఆర్ఎస్లు ఒక్కటేననే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలా తెలంగాణలో బీజేపీ ఆగమాగం అవుతున్న సమయంలో.. ఎక్కడో భోపాల్లో జరిగిన బీజేపీ మీటింగ్లో ప్రధాని మోదీ.. కవిత పేరు ప్రస్తావిస్తూ రాజకీయ విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశానికి బీఆర్ఎస్కు ఆహ్వానం లేదు. అయినా, మోదీ వదిలిపెట్టలేదు. ఆ మీటింగ్పై విమర్శలు చేసి.. ఆ భేటీకి హాజరుకాని బీఆర్ఎస్ను సైతం వారి సరసన చేర్చి.. సమానస్థాయిలో కౌంటర్ వేయడంలో రాజకీయ కోణమూ లేకపోలేదంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదనే మెసేజ్ ఇవ్వడంతో పాటు.. గులాబీ పార్టీ సైతం తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థేనని తేల్చి చెప్పడానికే మోదీ ఈ కామెంట్లు చేశారని తెలుస్తోంది. మరోవైపు, కవిత ఎపిసోడ్ మోదీ దృష్టిలో ఉందనే విషయమూ అర్థమవుతోంది. మరి, బుజ్జగింపులు, ఓటు బ్యాంకు రాజకీయాలు ఉండవని అన్నారంటే.. కవితను అరెస్ట్ చేస్తారా? స్వయంగా ప్రధానియే కవిత పేరు ప్రస్తావించాక కూడా అరెస్ట్ నుంచి కేసీఆర్ కూతురు తప్పించుకోగలరా? చూడాలి.