Jr NTR : తూర్పు గోదావరి జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృతి కలకలం రేపుతోంది. రెండ్రోజుల క్రితం శ్యామ్ అనే ఎన్టీఆర్ అభిమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే శ్యామ్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంలోనే శ్యామ్ మృతిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. శ్యామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ లేఖ విడుదల చేశారు. అసలు శ్యామ్ ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయాడో తెలియకపోవడం తన మనసును కలచివేస్తోందంటూ లేఖలో తెలిపారు. శ్యామ్ మృతిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అనుమానాస్పద మృతి ఘటనపై తక్షణమే దర్యాప్తు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు.
అయితే ఓ సినిమా ఆడియో ఫంక్షన్కు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంలో శ్యామ్ ఎన్టీఆర్ను కలిసేందుకు ప్రయత్నించగా అక్కడున్న సిబ్బంది అతనిని అడ్డుకున్నారు. అయితే స్పందించిన ఎన్టీఆర్ శ్యామ్ను దగ్గరకు తీసుకుని ఫొటో కూడా ఇచ్చారు.
శ్యామ్ మరణానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం పలు అనుమానాలకు తావిస్తోంది. తాను ఉన్నా లేకున్నా తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలంటూ సెల్ఫీ వీడియోలో కోరాడు. అందరి దృష్టిలో తాను ఉపయోగం లేని వ్యక్తిలా ఉన్నానని ఆవేదన చెందాడు. తనను క్షమించాలని కోరాడు. అసలు ఉద్యోగం చేయాలనే ఆసక్తి లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ సెల్ఫీవీడియోలో తెలిపాడు శ్యామ్.
జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన శ్యామ్ పూర్తి పేరు మేడిశెట్టి శ్యామ్ మణికంఠ వరప్రసాద్గా పోలీసులు గుర్తించారు. అయితే శ్యామ్ కుటుంబం పదేళ్ల క్రితం వలస తిరుపతికి వలస వెళ్లినట్లు తెలిపారు. గడలవారిపాలెంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంటూ తమకు సమాచారం రావడంతో అక్కడికి చేరుకుని దర్యాప్తు చేశామన్నారు పోలీసులు. శ్యామ్ ప్యాంట్ జేబులో బ్లేడ్, ఫోన్ ఉన్నట్లు తెలిపారు. చేతి మణికట్టును బ్లేడుతో కోసుకుని, తర్వాత ఉరేసుకుని ఉన్న ఆనవాళ్లు ఉన్నాయన్నారు పోలీసులు. శ్యామ్ హోటల్ మేనేజ్మోంట్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాడని, ఉద్యోగం కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నాడని బంధువులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కాల్డేటా ఆధారంగా దర్యాప్తు చేపడతామన్నారు.
శ్యామ్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండ్రోజుల క్రితం శ్యామ్ అనుమానాస్పద స్థితిలో మరణించడం అనుమానాలకు తావిస్తోందన్న చంద్రబాబు. అయితే శ్యామ్ మరణంలో వైసీపీ నేతల ప్రమేయం ఉందనే వాదన వినిపిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. శ్యామ్ మరణంపై లోతైన విచారణ జరిపి, మరణానికి గల కారణాలను నిగ్గు తేల్చాలని ప్రభుత్వాన్ని కోరారు.