Priyamani Reacts On Trolls : ఎక్కడైనా మనుషుల వెనుక మాట్లాడే మనస్తత్వాలు ఉండేవారు కనిపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో నటించే వారిని విమర్శించే వారు, వారి గురించి తక్కువ చేసి మాట్లాడేవారు మరికాస్త ఎక్కువే ఉంటారు. నటీనటులు కూడా మనుషులే అని గుర్తించకుండా వారిని కించపరిచేలా మాట్లాడేవారు ఎందరో. అలాంటి వారి గురించి సీనియర్ హీరోయిన్ ప్రియమణి తాజాగా స్పందించింది. తన ప్రొఫెషనల్ లైఫ్తో పాటు పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎలా విమర్శించేవారో బయటపెట్టింది.
సినీ పరిశ్రమలో హీరోల కంటే హీరోయిన్స్ మీద జరిగే ట్రోల్సే ఎక్కువ. ముఖ్యంగా వారి పర్సనల్ లైఫ్ గురించి ఏ హక్కు లేకపోయినా విమర్శించే వారే చాలా ఎక్కువ. అలా తాను కూడా ట్రోలింగ్కు గురయ్యానంటూ ప్రియమణి బయటపెట్టింది. ముఖ్యంగా తన పెళ్లి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారని చెప్పుకొచ్చింది. ప్రియమణి.. ముస్తఫా రాజ్ అనే ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీని గురించి తను చాలా విమర్శలు, ట్రోలింగ్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపింది.
ప్రియమణి పెళ్లి అయిన దగ్గర నుండి తన పర్సనల్ లైఫ్ గురించి పలువురు విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. అంతే కాకుండా వారి వైవాహిక జీవితం గురించి కూడా పలు రూమర్స్ క్రియేట్ చేసేవారు. ఇప్పటికే పలుమార్లు ప్రియమణి విడాకులు తీసుకోనుందని కూడా వార్తలు వచ్చాయి. వాటన్నింటికి ఈ నటి ఘాటుగానే స్పందించింది. తాజాగా మరోసారి వాటన్నింటిపై తన అభిప్రాయాన్ని తెలిపింది. ట్రోలింగ్స్ను తాను పెద్దగా పట్టించుకోనని చెప్తుంది ప్రియమణి.
బాడీ షేమింగ్ చేస్తూ, డస్కీ బ్యూటీ అని ఇప్పటికే తనపై కొందరు ట్రోల్స్ చేస్తూనే ఉంటారని ప్రియమణి బయటపెట్టింది. ముస్తఫాను పెళ్లి చేసుకున్నప్పుడు సోషల్ మీడియాలో తాను చాలా వ్యతిరేకత ఎదుర్కున్నానని గుర్తుచేసుకుంది. నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసినప్పుడు ‘నువ్వు ముస్లింను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు’ అని తిట్టారని తెలిపింది. ‘ఇది నా లైఫ్. ఎవరితో జీవితాన్ని పంచుకోవాలనేది పూర్తిగా నా ఇష్టం’ అంటూ తనపై కామెంట్స్ చేసేవారికి గట్టిగా సమాధానం ఇచ్చింది ప్రియమణి.