Vehicles That Run on Ethanol : ఇండియాలో రవాణా, ఆటోమొబైల్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి సంస్థలు మాత్రమే కాదు.. ప్రభుత్వం కూడా వాటికి సాయంగా నిలబడుతోంది. ముఖ్యంగా ఏదైనా కొత్త ప్రయోగం చేయడానికి ప్రభుత్వం దగ్గర నుండి సంస్థలకు తగినంత ప్రోత్సాహం దొరుకుతోంది. రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి అన్ని విధాలుగా ఆటోమొబైల్ సంస్థలను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అంతే కాకుండా కొత్త కొత్త ఐడియాలు కూడా ఇస్తున్నారు.
నితిన్ గడ్కరి మెర్సిడీస్ బెంజ్.. ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్ సమయంలో ఆ కంపెనీ ఛైర్మన్ను కలిశారు. ఆ సందర్భంలో బెంజ్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ గురించి భవిష్యత్తులో ఆలోచించదలచుకుంది అని ఛైర్మన్ తనతో చెప్పినట్టు గడ్కరి అన్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుగా కాకుండా పూర్తిగా ఇథనాల్ తో పనిచేసే వాహనాలను తయారు చేయడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు.
త్వరలోనే బజాజ్, టీవీఎస్, హీరోలాంటి స్కూటర్లు సైతం 100 శాతం ఎథనాల్తో నడిచే విధంగా తయారవుతాయని గడ్కరి అన్నారు. ఆగస్ట్లో టయోటా కంపెనీ కామ్రీ కారును లాంచ్ చేయనున్నట్టు బయటపెట్టారు. 100 శాతం ఇథనాల్ తో పనిచేసే మొదటి వాహనంగా టయోటా కామ్రీ ఇండియన్ రోడ్లపై తిరగనుందని సంతోషం వ్యక్తం చేశారు. కామ్రీ కేవలం 100 శాతం ఎథనాల్తో మాత్రమే కాకుండా 40 శాతం కరెంటును కూడా జెనరేట్ చేస్తుందని తెలిపారు.
పెట్రోల్, డీజిల్ లాంటి ఫ్లూయల్ రేట్లు ఇండియాలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. అప్పుడప్పుడు తగ్గుతున్నట్టు అనిపించినా వెంటనే మిడిల్ క్లాస్పై భారం వేసే విధంగా వీటి రేట్లు పెరుగుతున్నాయి. అందుకే ఇథనాల్ తో పనిచేసే వాహనాలను తయారు చేస్తే.. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే విధంగా గడ్కరి ఆలోచించి ఉండవచ్చని నిపుణులు చెప్తున్నారు. పెట్రోల్తో పోలిస్తే..ఇథనాల్ రేటు చాలా తక్కువ కాబట్టి ఇది వాహనదారులపై భారంలాగా ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.