KCR speech in maharashtra(News paper today) : తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని సీఎం కేసీఆర్ అన్నారు. మరి మహారాష్ట్రలో ఇలాంటి అభివృద్ధి ఎందుకు సాధ్యకాదని ప్రశ్నించారు. ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లిన గులాబీ బాస్ సోలాపుర్ జిల్లా సర్కోలీలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అన్ని వనరులూ ఉన్న మహారాష్ట్ర ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పారు.
స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా అభివృద్ధి విషయంలో రాష్ట్రం ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. దేశాన్ని 50 ఏళ్లపాటు కాంగ్రెస్ పాలించిందని గుర్తు చేశారు. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, శివసేన, బీజేపీకి అవకాశం ఇచ్చారని అన్నారు. తెలంగాణ మాదిరిగా మహారాష్ట్ర అభివృద్ధి ఎందుకు సాధ్యం కాదని కేసీఆర్ నిలదీశారు. రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే తెలంగాణ అభివృద్ధి సాధించిందని స్పష్టం చేశారు.
బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అన్న విమర్శలపైనా కేసీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ రైతుల పక్షాల మాత్రమే నిలుస్తుందని తేల్చిచెప్పారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. దేశం సరికొత్త పంథాలో నడవాల్సిన అవసరముందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్ర పర్యటనలో సీఎం కేసీఆర్ శ్రీవిఠల్ రుక్మిణీ ఆలయాన్ని సందర్శించారు. శ్రీవిఠలేశ్వర స్వామికి, రుక్మిణీ అమ్మవారికి పట్టువస్త్రాలు అందించారు. ఆలయ అర్చకులు కేసీఆర్ మెడలో తులసి మాల వేసి ఆశీర్వదించారు. శ్రీవిఠలేశ్వర స్వామి, రుక్మిణీ అమ్మవార్లతో కూడిన ప్రతిమను, అమ్మవారి చిత్రపటాన్ని కేసీఆర్కు అందించారు.