Infosys: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) అనేది అన్ని రంగాల్లో ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో అత్యంత అవసరమైనదిగా మారిపోయింది. ఈ టెక్నాలజీ ఇప్పుడు ఎన్నో రంగాలను శాసిస్తోంది. అందుకే త్వరలోనే దిగ్గజ టెక్ సంస్థలు కూడా దీనిపై ఆధారపడడానికి సిద్ధపడుతున్నాయి. అంతే కాకుండా దీనిపై అవగాహన లేకపోతే.. టెక్ ఉద్యోగులు కూడా ఇబ్బందిపడే పరిస్థితులు త్వరలోనే రానున్నాయి. అందుకే ఇన్ఫోసిస్ సంస్థ ఓ నిర్ణయానికి వచ్చింది.
ఇండియాలోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఇన్ఫోసిస్ కూడా ఒకటి. తాజాగా ఈ సంస్థ.. ఏఐ సెర్టిఫికేషన్ అని కొత్త ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసింది. అదే ఇన్ఫోసిస్ స్ప్రింగ్బోర్డ్. భవిష్యత్తులో ఉండే జాబ్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని, టెక్ రంగంలో ఉద్యోగుల్లాగా ఎదగాలి అనుకునేవారికి ఈ ప్రోగ్రామ్ సాయం చేస్తుంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్లో ఏఐకు సంబంధించి పలు కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఇంట్రడక్షన్ దగ్గర నుండి ఏఐ నుండి పూర్తిగా అవగాహన కల్పించే కోర్సులు అన్ని ఇందులో అందుబాటులో ఉంటాయి.
డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రొసెసింగ్, జెనరేటివ్ ఏఐ.. ఇలాంటి కోర్సులను ఇన్ఫోసిస్ స్ప్రింగ్బోర్డ్ అందిస్తుంది. వీటితో పాటు సిటిజెన్స్ డేటా సైన్స్ అనే పేరుతో మరో ప్రత్యేకమైన కోర్సును కూడా అందిస్తుంది. ఇందులో ఏఐ కాకుండా మిగతా డైటా సైన్స్కు సంబంధించిన అవగాహన కల్పిస్తుంది. సిటిజెన్స్ డేటా సైన్స్లో పైథాన్, లినియర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్.. ఇలా డేటా సైన్స్కు సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ అందుబాటులో ఉండనున్నాయి.
ఇన్ఫోసిస్ స్ప్రింగ్బోర్డ్ ప్రోగ్రామ్ అనేది ఏ డివైజ్ నుండి అయినా యాక్సెస్ చేసే విధంగా ఉంటుందని యాజమాన్యం చెప్తోంది. అంతే కాకుండా ఎవరైనా దీని ద్వారా ఏఐకు సంబంధించి, డేటా సైన్స్కు సంబంధించి కోర్సులు నేర్చుకోవచ్చని అంటోంది. దాదాపు 5.5 మిలియన్ మంది ఇప్పటికే ఇన్ఫోసిస్ స్ప్రింగ్బోర్డ్లో రిజిస్టర్ చేసుకున్నారని తెలుస్తోంది. మొత్తంగా తమ ఉద్యోగుల కోసం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి, కెరీర్ మార్గాన్ని ఎంచుకోవడానికి ఇన్ఫోసిస్ దారిచూపిస్తుందని అందరూ ప్రశంసిస్తున్నారు.