Vegetables: కూరగాయల ధరలకి రెక్కలొచ్చాయి. ఏ కూరగాయలు చూసుకున్నా రేట్లు మండిపోతున్నాయి. కిలో టమాటా వంద రూపాయలకి చేరింది. దీంతో సామాన్యులు జనం కొనలేని పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు కిలో టమాటా రూ.20ఉండగా ఇప్పుడు 100 రూపాయలు పలుకుతోంది. కూరగాయల ధరలకు తోడు మాంసా హారం ధరలు కూడా ఆకాశాన్నంటడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. .ఒక్కసారిగా ధరలు ఇంతగా పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డిమాండ్ సరిపడా కూరగాయల సాగు లేకపోవడం ఇందుకు కారణమమంటున్నారు.
టమాటా ఇతర జిల్లాల నుంచి దిగుబడి అవుతుండటంతో అమాంతం ధరలు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. పచ్చి మిర్చి 120, టమాటా 80, కాకరకాయ 100, వంకాయ 80, బీరకాయ 100, క్యారెట్ 100, దొండకాయ 100, ఆలుగడ్డ 100, ఉల్లిగడ్డ 30, బెండకాయ 80, దోసకాయ 100 రూపాయలు పలుకుతున్నాయి. వీటితోపాటు, ఇతర రకాల కూరగాయలు ధరలు మండిపోతున్నాయి.
ప్రతీ వానాకాలం సీజన్లో రైతులు ఇతర పంటల వైపు మొగ్గుచూపుతుండటంతో కూరగాయల సాగు విపరీతంగా తగ్గింది. దీంతో కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కూరగాయలు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో జనం ఏం కొనాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.