Congress News Telangana(Latest breaking news in telugu): కాంగ్రెస్ పార్టీకి బిగ్ డే. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో సందడే సందడి. అది హస్తిననా.. తెలంగాణా? అన్నట్టు నెలకొంది కోలాహలం. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 35 మంది ప్రముఖ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కలిశారు. పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు రాహుల్, ఖర్గేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జూలై 2న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు రాహుల్ను ఆహ్వానించారు.
అయితే, పార్టీ రిలీజ్ చేసిన చేరికల జాబితాలో జూపల్లి కృష్ణారావు పేరు అందరికంటే ముందు ఉండగా.. పొంగులేటి పేరు మాత్రం ఏకంగా 15వ నెంబర్లో చేర్చడాన్ని మీడియా హైలైట్ చేస్తోంది.
కాంగ్రెస్లో ‘ఘర్ వాపసీ’ జరుగుతోందని అన్నారు రాహుల్గాంధీ. గతంలో పార్టీని వీడిన వారు తిరిగి సొంతగూటికి చేరుతుండటం ఆనందంగా ఉందన్నారు. ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదంలో ముందుకెళ్లాలని నేతలకు రాహుల్గాంధీ సూచించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పారు. పార్టీ నేతలంతా సమష్ఠిగా పోరాడాలని పిలుపు ఇచ్చారు రాహుల్.
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నాయకత్వంలో ఢిల్లీలో ఈ భారీ కార్యక్రమం జరిగింది. రేవంత్తో పాటు.. కేసీ వేణుగోపాల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కీ, అరికెల నర్సారెడ్డి, గురునాథరెడ్డి తదితరులు ఉన్నారు.