Telangana congress party news(latest political news telangana) : తెలంగాణ రాజకీయ పరిణామాలు ఢిల్లీ కేంద్రంగా వేగంగా మారుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా కీలక నేతలు హస్తినలో ఉన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇప్పటికే అక్కడే మకాం వేశారు. తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో వారు భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కూడా ఉన్నారని తెలుస్తోంది.
పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పొంగులేటి, జూపల్లి భేటీ కానున్నారు. పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరితో పొంగులేటి భేటీ అయ్యారు. పార్టీలో చేరికలపై ఇరువురు నేతలు చర్చించారు. మరోవైపు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. దీంతో జగ్గారెడ్డి ఢిల్లి బాట పట్టారు.
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు జానారెడ్డి, చిన్నారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, జగ్గారెడ్డి ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీలో చేరికలపై చర్చించారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, అరికెల నర్సారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సహా పలువురు కీలక నేతలు కాంగ్రెస్లో చేరతారని సమాచారం. ఈ నేతలందరూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా సమావేశం కానున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. పొంగులేటిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం వల్లే కాంగ్రెస్లో చేరడం లేదని మల్లు రవి అన్నారు. ప్రజల అభిప్రాయం తీసుకుని కాంగ్రెస్లో చేరుతున్నారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ లో చేరేందుకు ఇంకా చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో వస్తారని టాక్ నడుస్తోంది. అటు బీఆర్ఎస్ కు, బీజేపీకి కీలక నేతలు షాకిస్తారనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యనేతలు పార్టీ వీడకుండా కాపాడుకునేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిచి చర్చలు జరిపింది.