YSR Law Nestham latest news(Andhra pradesh today news): ఏపీలో “వైఎస్ఆర్ లా నేస్తం” నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. 2023–24 సంవత్సరానికి తొలి విడత ఆర్థిక ప్రోత్సాహకాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. మొత్తం 2,677 మంది యువ న్యాయవాదులకు నెలకు రూ.5 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 5 నెలలకు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఇలాంటి పథకం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని సీఎం జగన్ అన్నారు. జూనియర్లుగా ఉన్న న్యాయవాదులు స్థిరపడ్డాక ఇదే మమకారం పేదలపై చూపించాలని సూచించారు. తాను అదే ఆశిస్తున్నానని.. ఈ విషయాన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని కోరారు.
కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కుకునేందుకు మూడేళ్లపాటు ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తోంది. ఏడాదికి రూ.60 వేల చొప్పున రెండు విడతల్లో వారి ఖాతాల్లో జమ చేస్తోంది. మూడేళ్లలో ఒక్కో న్యాయవాదికి మొత్తం రూ.1.80 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న నిధులతో కలిపి ఇప్పటివరకు 5,781 మంది యువ న్యాయవాదులకు రూ.41.52 కోట్లు చెల్లించింది.
న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేసింది. ఇందులో లా, ఫైనాన్స్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. న్యాయవాదులకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు కోసం ఇప్పటికే రూ.25 కోట్ల సాయం చేసింది.
ఆర్థికసాయం కోరే న్యాయవాదులు ఆన్లైన్లో sec_law@ap. gov.in ద్వారా లా సెక్రటరీకి దరఖాస్తు చేసుకోవాలి. వైఎస్ఆర్ లా నేస్తం పథకం పొందడంలో ఏమైనా ఇబ్బందులుంటే 1902 నంబర్ కాల్ చేసి సంప్రదించాలి.