Pawan Kalyan varahi yatra meeting(AP political news): జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉత్సాహంగా సాగింది. పార్టీ సభలకు జనం పోటెత్తారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలోని మలికిపురంలో చివరి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జనసేనాని ఘాటుగా విమర్శలు చేశారు. వైసీపీ అక్రమాల గురించి చదివి చదివి తనకు కళ్లజోడు వచ్చిందని సెటైర్లు వేశారు.
సీఎం జగన్ బటన్ నొక్కుతున్నా.. ఎంత మంది ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని పవన్ ప్రశ్నించారు. మీ ఓటర్లకు డబ్బులు ఇస్తే సరిపోతుందా? అని నిలదీశారు. అనేక వస్తువులను జీఎస్టీ చెల్లించి ప్రభుత్వ ఖజానాను ప్రజలు నింపుతున్నారని తెలిపారు. కానీ 100 మంది పన్నులు కడుతుంటే 40 మందికే డబ్బులు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాలోని డబ్బు అందరికీ సమానంగా పంచాలని స్పష్టం చేశారు. సీఎం జగన్ అంటే తనకు వ్యక్తిగత ద్వేషం లేదని స్పష్టం చేశారు.
150 మంది సభ్యులతో జనసేన ప్రారంభమైందని జనసేనాని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు సర్వసం కోల్పోయానని అనిపించిందని గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఓటమితో గుండెకోతను అనుభవించానని వివరించారు. రాజోలు విజయం ఎడారిలో ఒయాసిస్సులా అనిపించిందని తెలిపారు. ఈ గెలుపు ఓదార్పునిచ్చిందన్నారు. కానీ గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారి వెళ్లిపోయారన్నారు. 70 శాతం ప్రజల అనైక్యత వల్ల 30 శాతం మంది మద్దతు ఉన్న వారు గెలుస్తున్నారని పవన్ చెప్పుకొచ్చారు. ఓట్లు చీలడం వల్లే ప్రజావ్యతిరేకత ఉన్న వారు గెలుస్తున్నారని తెలిపారు.
కులాల మధ్య చిచ్చుపెట్టడానికి తాను ప్రజల మధ్యకు రాలేదని జనసేనాని స్పష్టం చేశారు. కులాలను కలపడానికే వచ్చానన్నారు. హీరోలను పొగిడితే ఓట్లు పడతాయని పొగడలేదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే వ్యక్తిని కానని తేల్చిచెప్పారు. ఇకపై గోదావరిలా ఉభయ గోదావరి జిల్లాలను అంటిపెట్టుకుని ఉంటానని స్పష్టంచేశారు.
రాజోలు రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని పవన్ విమర్శించారు. ఈ రహదారులపై గర్బిణీలు ప్రయాణం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని మండిపడ్డారు. 15 రోజుల్లో రోడ్లు వేయకపోతే తాను వచ్చి శ్రమదానం చేసి రోడ్లు వేస్తానని ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. ఎలా తిరుగుతావో చూస్తామంటూ తనకు వార్నింగ్ లు ఇస్తున్నారని కానీ రౌడీలకు భయపడే వ్యక్తిని కానని తేల్చిచెప్పారు. తాను విప్లవకారుడునని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు విప్లవ పంథాలో ఉన్న రాజకీయ నాయకుడి చూడలేదని ఇప్పుడు చూస్తారని ఘాటుగా హెచ్చరించారు.