Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఈజిప్టు అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది నైల్ అందుకున్నారు. ఆ దేశ పర్యటనకు వెళ్లిన మోదీకి ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి ఈ పురస్కారం ప్రదానం చేశారు. 1915 నుంచి ఈ పురస్కారాన్ని.. ప్రజలకు విశేష సేవలందించిన వివిధ దేశాల అధినేతలు, రాజులు, ఉపాధ్యక్షులకు అందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మోదీకి ఇది 13వ పురస్కారం.
ఈజిప్టులోని పురాతన మసీదును మోదీ సందర్శించారు. మతపెద్దలతో కలిసి అల్- హకీం- మసీదు మొత్తం తిరిగారు. ప్రార్థనా మందిరం గోడలు, తలుపులపై చెక్కిన శాసనాలను శ్రద్ధగా పరిశీలించారు. 11వ శతాబ్దంలో ఈ మసీదును నిర్మించారు. ఇటీవల పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ పనుల వివరాలను దావూదీ బోహ్రా వర్గానికి చెందిన మతపెద్దలు మోదీకి వివరించారు.
11వ శతాబ్దంలో కైరోలోనే అతిపెద్ద మసీదుల్లో అల్- హకీం- మసీదు ఒకటి. వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మసీదు 13,560 చదరపు మీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ప్రధాన ప్రార్థనా మందిరం 5 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీనిని అరబ్ మూలాలున్న ఇస్మాయిలీ షియా వర్గానికి చెందిన దావూదీ బోహ్రా వర్గం వారు ఇటీవల పునరుద్ధరించారు. ఈజిప్టుకు చెందిన ఈ దావూదీ బోహ్రాల్లో కొంత మంది తొలుత యెమెన్ వలస వెళ్లారు. అక్కడ నుంచి భారత్కు వచ్చి స్థిరపడ్డారు. భారత్లో ఈ వర్గం జనాభా సుమారు 5 లక్షల ఉంటుంది.