Pawan Kalyan speech today live(Latest political news in andhra Pradesh) : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాహి యాత్ర చేపట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో పార్టీ నేతలతో జనసేనాని భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మరోసారి సీఎం జగన్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేరగాళ్లు రాజకీయాలు చేస్తే రాష్ట్రం నాశనమవుతుందన్నారు.
వైసీపీ నాయకులు పులివెందుల సంస్కృతిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు తెచ్చారని జనసేనాని మండిపడ్డారు. నేరగాళ్ల బెదిరింపులకు మంచివాళ్లు కూడా లొంగిపోతారని అన్నారు. వైసీపీ మాదిరిగా తాను కుల రాజకీయాలు చేయలేనని స్పష్టం చేశారు. భిన్న కులాలు, మతాల నుంచి జనసేన సభ్యులను తీసుకున్నానని చెప్పుకొచ్చారు. జనసేన భావజాలం అవసరం ప్రజలకు ఉందన్నారు. ఎన్నికల్లో ఓడినా నిలదొక్కుకోవడమే గొప్ప విషయంగా పేర్కొన్నారు.
తాను పదే పదే కుల, మత ప్రస్తావన తేవటంపై వస్తున్న విమర్శలకు జనసేనాని సమాధానం చెప్పారు. కులాల ప్రస్తావన తీసుకురావడం రెచ్చగొట్టేందుకు కాదని కుల సర్దుబాటు కోసమేనన్నారు. గత ఎన్నికల్లో రాజోలు విజయం జనసేనకు ఊపిరి పోసిందని తెలిపారు. మన ఓటుతో గెలిచి జవాబుదారీతనం లేకపోతే కుదరదన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని ప్రజలు రీకాల్ చేయాలని సూచించారు. పార్టీ మారిన వారిపై రెఫరెండం పెట్టి అనర్హత వేటు వేసేలా చట్టాలు తీసుకురావాలని స్పష్టం చేశారు. మన ఓట్లు తీసేస్తారని, దొంగ ఓట్లు వేస్తారని జాగ్రత్తగా ఉండాలని జనసేన శ్రేణులను అప్రమత్తం చేశారు. రాజకీయాల్లో మూడోవంతు పదవులు మహిళలకు ఇవ్వాలన్నారు.
ప్రజల హక్కులకు భంగం కలిగితే పోరాడతానని ఎదురుతిరుగుతానని పవన్ తేల్చిచెప్పారు. రూ.200 లంచం తీసుకున్న ఉద్యోగికి శిక్ష పడుతుంది కానీ.. రూ.వేల కోట్లు దోపిడీ చేసే నేతలు పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి జిల్లాల నుంచే మార్పు మొదలు కావాలని కోరారు. వచ్చే ఎన్నికలు మార్పునకు సంకేతమని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని జనసేనాని పిలుపునిచ్చారు.