Tesla huge Investment in India : గత కొన్నేళ్లలో ఇండియన్ మార్కెట్ అనేది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ, లాభాలను సంపాదిస్తూ ముందుకెళ్తోంది. అంతే కాకుండా కొన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ సక్సెస్ కూడా సాధిస్తోంది. అందుకే అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు సైతం ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. తాజాగా ఎలన్ మస్క్ ఆటోమొబైల్ సంస్థ టెస్లా కూడా ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
టెస్లా.. తన వ్యాపారాన్ని వ్యాప్తి చెందేలా చేయాలని చూస్తుందని, త్వరలోనే పలు పెట్టుబడులు పెట్టనుందని ఎలన్ మస్క్ తాజాగా ప్రకటించాడు. ఆ తర్వాత ప్రధాని మోదీ అమెరికా పర్యటన సమయంలో ఆయనన కలిశాడు. దీంతో ఎలన్ మస్క్ ఇండియాలోనే పెట్టుబడులు పెట్టనున్నట్టు పరోక్షంగా బయటపెట్టాడని కొందరు భావిస్తున్నారు. అంతే కాకుండా త్వరలోనే టెస్లాను ఇండియాకు సాధ్యమయినంత త్వరగా తీసుకోస్తానని ఒక సందర్భంలో చెప్పాడు కూడా.
ప్రస్తుతం ఇండియాలో కూడా ఎలక్ట్రిక్ కార్ల క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. దానికి తగినట్టుగా ఆటోమొబైల్ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీపై పూర్తిగా దృష్టిపెట్టాయి. ఒక్కసారి వారు అంచనా వేసినట్టుగా ఈవీ వాహనాలు రోడ్ల మీద తిరగడం మొదలుపెడితే.. టెస్లా ఇండియాకు రావడానికి ఏ మాత్రం ఆలోచించదు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. టెస్లా కార్లకు అమెరికా లాంటి దేశాల్లో మాత్రమే కాదు.. ఇండియాలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఒకవేళ టెస్లా ఇండియాలో ఒక బ్రాంచ్ను ప్రారంభిస్తే.. ఒక్క నిమిషం కూడా వెనకాడకుండా ఈ కార్లను కొనేవారు కూడా చాలామంది ఉన్నారు.
ప్రధాని మోదీని కలిసిన సందర్భంలో మస్క్ కృతజ్ఞత తెలియజేస్తూ.. త్వరలోనే ఒక మంచి విషయం అనౌన్స్ చేస్తామని ప్రకటించాడు. ఇండియాలో పెట్టుబడి గురించి అప్డేట్ ఇస్తానని తెలిపాడు. గతేడాది ఇంపోర్ట్ కార్ల విషయంలో ట్యాక్స్ను తగ్గించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాడు మస్క్. అంటే ఎంతోకాలంగా ఇండియాలో టెస్లా అడుగుపడేలా చేయాలని తను భావిస్తున్నట్టు అర్థమవుతోంది. ముందుగా ఒక ఫ్యాక్టరీని ప్రారంభించి పెట్టుబడులను పెట్టుబడులను శుభారంభం చేయాలని మస్క్ అనుకుంటున్నట్టు నిపుణులు భావిస్తున్నారు.