Vegetables Rate : కిలో టమాట 50 రూపాయలు. పచ్చిమిర్చీ అయితే ఏకంగా 180 రూపాయలు. మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ప్రతీ కూరగాయ ధర ఆకాశాన్ని అంటుతోంది. సరైన సమయంలో వర్షాలు లేకపోవడం.. దిగుబడి తగ్గడంతో.. ధరలు చుక్కలనుంటుతున్నాయి. కూరగాయలను సామాన్యుడు కొనే పరస్థితి లేకుండా పోయింది. 500 రూపాయలతో బజార్ కెళ్తే.. వారం సరిపడా కూరగాయలు కూడా రావడం లేదని వాపోతున్నారు. రైతుబజార్ లో ధరల పట్టికలో ఒక్క కూరగాయ రేటైనా.. 50 కి తక్కువగా లేకపోవడంతో.. వినియోగదారుడి గుండె గుబేల్ మంటోంది.
వర్షాకాలం ప్రారంభమైనా.. కూరగాయల ధరలు మాత్రం పైపైకే వెళ్తున్నాయి. గతవారం వరకు ఎండలు మండిపోయాయి. చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో.. కేవలం బోరుబావి సౌకర్యం ఉన్నవారు మాత్రమే కూరగాయలను పండించారు. కొన్ని చోట్ల సరైన సమయంలో పంటకు నీరందక.. వదిలేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీంతో వర్షాకాలం మొదట్లోనే కూరగాయల దిగుబడి భారీగా తగ్గింది. డిమాండ్ కు తగ్గట్లు సప్లై లేకపోవడంతో.. ధరలు సామాన్యుడికి అందనంటున్నాయి. ఇటు వ్యాపారులు కూడా పక్క మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నామనే సాకుతో ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు. ఏం కొనేటట్టు, ఏం తినేటట్టు లేదంటూ వినియోగదారులు తలలు పట్టుకుంటున్నారు.