KCR news today telugu(Telugu flash news): కాదేదీ రాజకీయాలకు అనర్హం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా.. తెలంగాణ, ఏపీ ఇష్యూలు వ్యూహాత్మకంగా వివాదాస్పదమవుతుంటాయి. తెలంగాణ బెటర్ అని చెప్పేందుకు ఏపీ విషయాలను.. ఏపీలో పాలన వేస్ట్ అనడానికి తెలంగాణ అంశాలను.. కావాలని తెరమీదకు తీసుకొస్తుంటారు. లేటెస్ట్గా భూముల ధరలపై రెండు రాష్ట్రాల పార్టీల మధ్య రాజకీయ రచ్చ నడుస్తోంది.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని.. సరైన పాలన లేక ఏపీ వెనుకబడిందని ఇటీవల సీఎం కేసీఆర్ తరుచూ ఆరోపిస్తున్నారు. తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఏపీలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే, గులాబీ బాస్ టీజింగ్ను.. ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు క్యాచ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో దారుణమైన పాలన వల్ల.. భూముల రేట్లు పడిపోయాయంటూ కేసీఆర్ డైలాగును వాడేశారు. కేసీఆర్కు కావలసిందీ ఇదే. అదిగో చూశారా.. చంద్రబాబు సైతం తెలంగాణను ఎలా పొగుడుతున్నారో అంటూ.. భూముల ధరల గురించి మరోసారి గొప్పగా చెప్పారు సీఎం కేసీఆర్.
కేసీఆర్ ఇలా అనగానే రేవంత్రెడ్డి అలా స్పందించారు. భూముల ధరలు పెరగడానికి.. ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. తెలంగాణను అభివృద్ధి చేసింది తానేనని చంద్రబాబు పదే పదే చెబుతుంటారని.. మరి ఆ విషయాన్ని కూడా కేసీఆర్ అంగీకరిస్తారా? అని కౌంటర్ వేశారు పీసీసీ చీఫ్.
కట్ చేస్తే.. ఇదేదో తేడాగా ఉందే అని ఉలిక్కిపడింది అధికార వైసీపీ. వెంటనే మంత్రి అమర్నాథ్ రంగంలోకి దిగిపోయారు. విశాఖ అచ్యుతాపురంలో ఎకరం భూమి అమ్మితే.. తెలంగాణలో వంద ఎకరాలు కొనొచ్చని రివర్స్ అటాక్ చేశారు. ఆ తర్వాత సలహాదారు సజ్జల సైతం ఈ టాపిక్పై స్పందించారు. ముంబైలో ఎకరం అమ్మితే హైదరాబాద్లో వందెకరాలు.. న్యూయార్క్లో ఎకరం అమ్మితే ముంబైలో వందెకరాలు కొనొచ్చని ఎద్దేవా చేశారు. ఇలా ఎకరం పాలిటిక్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి.