Telugu states News(Morning news today telugu): తెలుగు రాష్ట్రాల మధ్య భూముల ధరల పంచాయితీ మొదలైంది. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనొచ్చు అంటూ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి . ఈ మాట తాను అనడం లేదని….చంద్రబాబే చెప్పారని అంటున్నారు కేసీఆర్. రోజురోజుకు తెలంగాణలో భూముల ధరలు అమాంతం పెరుగుతున్నాయన్నారు.
ఒకప్పుడు ఏపీలో ఒక ఎకరం అమ్ముకొంటే తెలంగాణ మూడేకరాలు వచ్చేవి కానీ గత నాలుగేళ్లుగా ఏపీలో అభివృద్ధి నిలిచిపోవడంతో భూముల ధరలు పెరగలేదంటూ ఇటీవల కామెంట్స్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. తెలంగాణలో జోరుగా అభివృద్ధి జరుగుతుండటంతో అక్కడ భూముల ధరలు బాగా పెరిగాయని…. ఇప్పుడు అక్కడ ఒక ఎకరం అమ్ముకొంటే ఏపీలో 50-100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందన్నారు చంద్రబాబు. ఇందుకు.. ఏపీలో అభివృద్ధి లేకపోవడమే కారణమన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. తెలంగాణలో భూముల గురించి పక్క రాష్ట్రాలే చెబుతున్నాయని అంటున్నారు.
మరోవైపు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు….. ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటరిచ్చారు. ఏపీలో భూముల ధరలపై కేసీఆర్ ఎందుకు మాట్లాడారో తెలియదన్నారు. విశాఖలో కూడా ఎకరం అమ్మితే.. తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చని ఎద్దేవా చేశారు. తెలంగాణలో హైదరాబాద్ కాకుండా బయటికి వెళితే ధర ఎక్కడుందని ప్రశ్నించారు.