Modi : భారత్ , అమెరికా కలిసి నడవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. యూఎస్ లో ప్రపంచ ప్రఖ్యాత విద్యాలయాలున్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులో ఉందన్నారు. భారత్ లో ప్రపంచంలోనే అతి పెద్ద యువశక్తి ఉందని పేర్కొన్నారు. భారత్ , యూఎస్ కలిస్తే సుస్థిర, సమ్మిళిత ప్రపంచాభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఆ దిశగా ఈ దశాబ్దిని టెక్ టెక్ డెకేడ్ చేయాలన్నదే తన లక్ష్యమన్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న మోదీ ఆ దేశ ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్తో కలిసి నేషనల్ సైన్స్ ఫౌండేషన్ భవిష్యత్ నైపుణ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. యువతలో నైపుణ్యాల పెంపు కోసం భారత్ లో తీసుకుంటున్న చర్యలను తెలిపారు. స్కిల్ ఇండియా కార్యక్రమం ద్వారా 5 కోట్ల మందికి కృత్రిమ మేధ, బ్లాక్చైన్, డ్రోన్ లాంటి అత్యాధునిక సాంకేతికతల్లో శిక్షణనిచ్చామని చెప్పారు. విద్య, పరిశోధన రంగాల్లో భారత్, అమెరికా మధ్య సంబంధాల బలోపేతానికి మోదీ 5 ప్రతిపాదనలు చేశారు. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి స్టార్టప్ ఇండియా మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మోదీ తెలిపారు.
ప్రధాని మోదీపై బైడెన్ ప్రశంసలు కురిపించారు. ప్రతి భారతీయుడు విద్యావంతుడు కావాలని ఎంతో కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. అమ్మాయిల చదువు కోసం ఎన్నో అవకాశాలు సృష్టిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తు అవసరాలకు యువతులు నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. భారత్- అమెరికాల బంధానికి విద్య ఒక కారణమని స్పష్టం చేశారు. ఈ పర్యటన ఇరు దేశాల విశ్వవిద్యాలయాలు పరిశోధనల్లో, ఇంటర్న్షిప్, శిక్షణ కార్యక్రమాల్లో కలిసి ముందుకు సాగేందుకు సహాయపడుతుందని తెలిపారు.