Telangana : తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. గురువారం నాటికి ఖమ్మం వరకు విస్తరించాయి. అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల నుంచి ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాల సమీపం వరకు ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గురువారం జోరు వానలు పడ్డాయి. శుక్ర, శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇక హైదరాబాద్లో కూడా వాతావరణం చల్లబడింది. గురువారం చిరు జల్లులు పడ్డాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణ, హైదరాబాద్లకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇవాళ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలతోపాటు హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు చెప్పారు.
రేపు, ఎల్లుండి తక్కువ నుంచి మధ్యస్థ స్థాయిలో వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రుతపవనాలు విస్తరంచడంతో.. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. పలు జిల్లాల్లో విత్తనాలు వేయడం మొదలుపెట్టారు. మరో రెండు రోజులు వర్షాలు పడితే పెద్దఎత్తున విత్తనాలు వేసే అవకాశముంది. కనీసం వారం రోజుల పాటు వర్షాలు కురిస్తేనే నార్లు పోస్తామని రైతులు అంటున్నారు.