Jagananna Suraksha Programme(AP political news): ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టింది. నెల రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమం చేపడతారు. సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే జగనన్న సురక్ష కార్యక్రమం లక్ష్యం. పథకాలు పొందడంలో ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి వెళతారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు రాకపోతే వారికి లబ్ధి చేకూరేలా చేస్తారు.
దరఖాస్తులు తీసుకుని సచివాలయంలో ఇస్తారు. టోకెన్ నంబర్, సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ లబ్ధిదారుడికి అందజేస్తారు. మండల స్థాయిలో తహశీల్దార్, ఈఓపీఆర్డీ ఒక టీమ్ గా ఉంటారు. ఎంపీడీఓ, డిప్యూటీ తహశీల్దార్ రెండో టీమ్గా ఉంటారు. ఆ టీమ్ ఒక సచివాలయంలో రోజంతా పూర్తిగా గడిపేలా చూస్తారు.
జూలై 1 నుంచి ప్రతి సచివాలయంలో క్యాంపు నిర్వహిస్తారు. అక్కడికక్కడే ప్రజల సమస్యలను పరిష్కరిస్తారు. జనన, మరణ, కుల, ఆదాయ, కుటుంబ, వివాహ ధ్రువీకరణ పత్రాలు, లావాదేవీ మ్యుటేషన్లు, ఫోన్ నంబర్కు ఆధార్ అనుసంధానం, పంట సాగు కార్డులు, కొత్త రేషన్ కార్డు, కుటుంబ వివరాల్లో మార్పులు చేర్పులు ఇలా 11 రకాల సర్టిఫికెట్లను రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమంలో అందిస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా 15,004 సురక్ష క్యాంపులు నిర్వహిస్తారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక ఐఏఎస్ అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు క్యాంపుల్లో తనిఖీ చేస్తారు. సీఎం కార్యాలయ అధికారులు ఈ కార్యక్రమంపై ప్రతివారం సమీక్ష చేస్తారు. వాలంటీర్లతో కూడిన ఈ టీమ్ 1902 హెల్ప్డెస్క్ ద్వారా ప్రజలకు సాయం అందిస్తుంది.